అమిత్‌ షాతో నారా లోకేష్‌ భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన నెల రోజుల తర్వాత ఆయన కుమారుడు నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. సెప్టెంబర్ 14నుంచి ఢిల్లీలోనే ఉంటున్న లోకేష్ బీజేపీ అగ్రనేతల దృష్టికి చంద్రబాబు వ్యవహారాన్ని తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ఒకరిద్దరు ప్రాంతీయ పార్టీల నాయకుల దృష్టికి తీసుకువెళ్లడం మినహా బీజేపీ అగ్రనేతలను కలిసే ప్రయత్నాలు ఫలించలేదు. ఈ లోగా చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పెద్దల ప్రమేయం ఉన్నట్లు కధనాలు వ్యాప్తి చెందుతున్నాయి. స్వయంగా వైసిపి ఎంపీ ఒకరు ఆ విధంగా చెప్పారు. ఈ క్రమంలో లోకేష్‌ అమిత్‌‌షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరింపచేసుకుంది. 
 
రెండు తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు డి. పురంధేశ్వరి, జి. కిషన్‌ రెడ్డిలతో కలిసి లోకేష్‌, అమిత్‌‌షాతో భేటీ కావడం గమనార్హం.  రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు పగబట్టి తీరును అమిత్ షాకు లోకేష్ వివరంగా వివరించారని, కేంద్రంపై నిందలు వేసే వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉంటే అమిత్ షా లోకేష్‌కి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇస్తారని ఈ తర్వాత ఓ ట్వీట్ లో పరోక్షంగా వైసిపి నేతలను పురంధేశ్వరి ప్రశ్నించారు.

అక్టోబర్ 10,11 తేదీలలో సిఐడి విచారణకు హాజరైన లోకేష్, బుధవారం విచారణ ముగిసిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలిశారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్‌ను 12వ తేదీ వరకు అరెస్ట్‌ చేయొద్దని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిసిన లోకేష్  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలన ఆయన దృష్టి కి తీసుకెళ్లినట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న కక్ష సాధింపు చర్యలను కూడా  వివరించారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షాకు లోకేష్ వివరించారు. 

లోకేష్‌ చెప్పిన అంశాలను విన్న తర్వాత చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? లోకేష్‌పై ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా ఆరా తీశారు. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకి లోకేష్ వివరించినట్టు తెలుస్తోంది.

73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డట్టు లోకేష్‌ తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు.