లోకేశ్‌కు ప్ర‌శ్న‌ల‌మీద ప్ర‌శ్న‌లు సంధించిన సీఐడీ

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ను సీఐడీ  మంగళవారం సుదీర్ఘంగా ఆరు గంటల పాటు విచారించింది.  అయితే త‌మ ప్ర‌శ్న‌ల‌కు స‌రిగా స‌మాధానం చెప్ప‌లేద‌ని, లోకేష్ ఏమాత్రం సహకరించలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా లోకేష్‌ను సీఐడీ ఆదేశించిన‌ట్టు తెలుస్తున్నది. 
 
మంగళవారం సుదీర్ఘ విచారణ అనంతరం సీఐడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన లోకేశ్ మీడియాతో  మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఏ ప్ర‌శ్న అడ‌గ‌లేదని, అడిగిన 50 ప్రశ్నల్లో ఒక్కటి కూడా కుటుంబ సభ్యులు ఎలా బాగుపడ్డారని అడగలేదని లోకేష్ తెలిపారు.  హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఏం జరిగిందో అడిగారని, మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన జీవోఎం వివరాలు అడిగారని ఆయన వెల్లడించారు.
తనను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని చెబుతూ మళ్లీ రేపు రావాలని 41ఏ నోటీసు ఇచ్చారని చెప్పారు. అలైన్‌మెంట్‌కు సంబంధించి ఒకే ఒక్క ప్రశ్న అడిగారని తెలిపారు.  కక్ష సాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ ఎఫ్ఐఆర్‌లు పెట్టారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్ చేస్తే తెలిసే విషయాలను అడిగారని చెబుతూ త‌న ముందు ఈ కేసుకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పెట్టలేద‌ని స్పష్టం చేశారు.

ఎన్ని ప్రశ్నలు అయినా అడగండి ఎంతలేట్‌ అయినా వుంటానని చెప్పినా మరో రోజు రావాలని సిఐడి నోటీసులు ఇచ్చిందని తెలిపారు. బుధవారం కూడా తాను విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు. హెరిటేజ్‌ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చారన్నది తనపై మోపుతున్న అభియోగమని, అయితే, తాను మంత్రిగా ఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నానో సిఐడి చెప్పలేక పోతోందని విమర్శించారు.

కాగా, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు విచారణ అధికారిని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడిషన్‌ ఎస్‌పి జయరాజుకు బదులుగా డిఎస్‌పి విజయ్ భాస్కర్‌కు విచారణ బాధ్యతలను అప్పగించినట్లు మంగళవారం విజయవాడ ఎసిబి కోర్టుకు ప్రభుత్వం సమాచారం అందించింది.