బీఆర్ఎస్ కుటుంబ పాలన అంతం కావడం ఖాయం

తెలంగాణలో కేసీఆర్‌ పాలన రజాకార్లను తలపిస్తోందని చెబుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబపాలన అంతం కావడం ఖాయం అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భరోసా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బిజెపి రాష్త్ర కౌన్సిల్ సమావేశాలను జ్యోతి ప్రజ్వలన చేసి శుక్రవారం ప్రారంభిస్తూ తెలంగాణలో బీజేపీ గెలవాలని, దాంతో పాటు మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి తేవాలని పిలుపిచ్చారు.

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 9 ఏళ్లలో రూ. 9 లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు.  తెలంగాణలో 2 కోట్ల మందికి కేంద్రం రేషన్ ఇస్తోందని పేర్కొంటూ  ఇటీవల గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోదీ  ప్రకటించారని గుర్తుచేశారు.  

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ గతంలో ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించిందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పటి బీఆర్ఎస్) ఆ విధంగా ఆవిర్భవించిందే అని చెప్పారు.  కేవలం తమ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసం ఏర్పడిన  ప్రాంతీయ పార్టీలు క్రమక్రమంగా కుటుంబ పార్టీలుగా మారిపోయాయని విమర్శించారు. 

అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఓ కుటుంబ పార్టీ అని స్పష్టం చేస్తూ ప్రధాని మోదీ తెచ్చిన ఎన్నో పథకాలు  తెలంగాణలో అమలు కాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోందని నడ్డా మండిపడ్డారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని పేర్కొంటూ  సింగిల్ బెడ్రూం గతి లేదు కానీ బీఆర్ఎస్ నేతలు డబుల్ బెడ్రూం  అంటున్నారని ఎద్దేవా చేశారు.

టీఎస్పీఎస్సీ  పేపర్ లీకేజి తో 30 లక్షల మంది యువత జీవితాలతో చెలగాటం అడుతున్నారని నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజి లకు కారణమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అగ్రగామిగా నిలిచిందని చెబుతూ దేశవ్యాప్తంగా గరిబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ సరఫరా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. ఇందులో తెలంగాణకి చెందిన రెండు కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారని ఆయన చెప్పారు. 

ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం భారత్‌లో 13కోట్ల మంది పేదరికాన్ని జయించారని నడ్డా గుర్తు చేశారు. ఎన్నో ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను ఎందుకు అబివృద్ధి చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు.  ప్రధాని అవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా 4కోట్ల ఇళ్లను నిర్మించామని చెబుతూ మరీ తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎన్ని నిర్మించారో చెప్పాలని సవాల్ చేశారు.  

తెలంగాణలో 31 లక్షల టాయిలెట్లు నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అని వెల్లడించారు.  ఉజ్వల పథకం కింద సిలిండర్ కి రూ. 300 సబ్సిడీ ప్రకటించడంతో 9 కోట్ల 50 లక్షల మందికి లబ్ది చేకూరనుందని తెలిపారు. ఏడాదికి రూ. 6 వేల కోట్లతో రైతుల ఖాతాలో కిసాన్ సమ్మన్ నిధి జమ అవుతోందని చెబుతూ దేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు. దీంట్లో 38లక్షల 50వేల తెలంగాణ రైతులు ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణాలో జాతీయ రహదారుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచామని గుర్తు చేశారు.

తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవశ్యకత పార్టీ కార్యకర్తలపై ఉందని నడ్డా సూచించారు. ఇచ్చిన హామీలనే కాదు.. చెప్పని హామీలను సైతం బిజెపి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. దేశాభివృద్ధికి పాటుపడేది ఒక్క బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు.