జీ 20 పార్లమెంట్ స్పీకర్ల సదస్సుకు హాజరు కానున్న కెనడా

భారత్‌, కెనడా మధ్య ద్వైపాక్షిక దౌత్య సంబంధాలలో ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ భారత్ లో జరుగనున్న జీ20 పార్లమెంట్ స్పీకర్ల సదస్సుకు కెనడా హాజరు కానున్నది. ఈ సదస్సుకు హాజరవుతామని ఆ దేశం స్పష్టం చేసిందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు.
 
 అక్టోబరు 12 నుంచి 14 వరకు ఢిల్లీలో జీ20 పార్లమెంటరీ స్పీకర్స్ సదస్సు (పీ20) జరుగుతుందని ఓం బిర్లా చెప్పారు. జీ20 కూటమి దేశాలను ఈ సదస్సుకు ఆహ్వానించినట్లు వివరించారు. దీనికి హాజరవుతామని కెనడా సెనేట్ స్పీకర్ ధృవీకరించినట్లు వెల్లడించారు.
 
కాగా, భారత్‌లో జరుగనున్న జీ20 పార్లమెంటరీ స్పీకర్స్ సదస్సుకు  పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ తొలిసారి హాజరవుతున్నదని ఓం బిర్లా తెలిపారు. అయితే అంతర్గత కారణాల వల్ల జర్మనీ, అర్జెంటీనాలు ఈ సదస్సుకు హాజరుకావడం లేదని చెప్పారు. ‘ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి’ అన్న పేరుతో నిర్వహించే 9వ జీ20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్‌లో పలు అంశాలపై చర్చ జరుగుతుందని స్పీకర్‌ ఓం బిర్లా వివరించారు.