పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్లోని మరో మంత్రి ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడి చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్మెంట్ కుంభకోణానికి సంబంధించి ఆహార శాఖ మంత్రి రతిన్ ఘోష్ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా కోల్కతాలోని మంత్రి ఇంటితోపాటు 13 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నది.
గతంలో రతిన్ ఘోష్ మధ్యంగ్రామ్ మున్సిపాలిటీ చైర్మన్గా పనిచేశారు. ఆ సమయంలో పురపాలికలో పెద్ద సంఖ్యలో అనర్హులకు ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం ఘోష్తోపాటు అతని సహచరులు అభ్యర్థుల నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఘోష్ నివాసంతోపాటు 13 నివాసాల్లో ఈడీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాల కేసులో టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 9న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసులో ఆయన భార్య రుజిరాకు కూడా నోటీసులు పంపింది. ఆమెను ఈ నెల 11న విచారణకు రావాలని కోరింది. ఎంపీ అభిషేక్కు ఈ నెల 3నే ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన హాజరు కాలేదు.
కర్ణాటకలో కాంగ్రెస్ నేత ఇంట్లో సోదాలు
మరోవంక, కర్ణాటక కాంగ్రెస్ నేత, శివమొగ్గ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ (డిసిసి) బ్యాంక్ అధ్యక్షుడు ఆర్.ఎం. మంజునాథ్ గౌడ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) గురువారం దాడులు నిర్వహిస్తోంది. తిరుతహళ్లి, శివమొగ్గ జిల్లాల్లోని ఆయన నివాసాలతో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపడుతున్నారు. దీంతో భారీగా పోలీసుల బలగాలను మోహరించారు.
సెప్టెంబర్ 29న ఎన్నికైన మంజునాథ్ గౌడ్ ఆరోసారి డిసిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం డిసిసి కుంభకోణం విచారణలో భాగంగా ఈ సోదాలు చేపడుతున్నట్లు ఈడి తెలిపింది. గౌడ కర్ణాటక ఉప ముఖ్య మంత్రి డి.కె. శివకుమార్ కి సన్నిహితుడు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉన్నారు.
గతంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి ఎస్ యడియూరప్పకు సన్నిహితుడైన గౌడ 2013కి ముందు కర్ణాటక జనతా పక్ష (కెజెపి)లో చేరారు. కెజిపి ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల తర్వాత యడియూరప్ప కెజిపిని బిజెపిలో విలీనం చేశారు. దీంతో గౌడ కెజిపిని వీడి కాంగ్రెస్ లో చేరారు.
More Stories
బంగారం స్మగుల్డ్ చేస్తూ చిక్కిన అఫ్ఘన్ దౌత్యవేత్త
మసాలా సుగంధ ద్రవ్యాలపై దేశవ్యాప్తంగా తనిఖీలు
చైనాలో ఆర్థిక సవాళ్లు నిజమేనన్న జిన్పింగ్