భారత్ అమెరికా బంధం అపరిమితం అని, ఎంత దూరం అయినా విస్తరించుకుంటాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ఇప్పుడు ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంతగా అపూర్వస్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య స్నేహం చంద్రయాన్ మాదిరిగా చంద్రుడి వద్దకు, చంద్రుడిని దాటుకుని కూడా వెళ్లుతాయని జైశంకర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఇక్కడి ఇండియా హౌస్లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వందలాది మంది ఇండో అమెరికన్లను ఉద్ధేశించి ఆదివారం మాట్లాడారు. ఇక్కడి భారతీయ రాయబార కార్యాలయం జైశంకర్ ఆగమనం నేపథ్యంలో ‘ ఏర్పాటు చేసిన స్నేహబంధం విజయపథ ఘట్టం కార్యక్రమంలో ప్రసంగించారు.
అమెరికాలో పలు ప్రాంతాలలో నివాసం ఉంటున్న ఇక్కడి భారతీయ సంతతి వారితో ఇక్కడి ఈ సభలో ముచ్చటించడం సంతోషకరంగా ఉందని జైశంకర్ తెలిపారు. ఇండియా హౌస్కు ఇంతకుముందెన్నడూ లేని సంఖ్యలో ఇండో అమెరికన్లు తరలివచ్చారు. ఇక్కడ అమెరికాలో ఓ పాపులర్ పాటలో మార్మోగినట్లు, ఇరుదేశాల మధ్య బంధం మరింత బహుముఖం అవుతుందని తెలిపారు.
అమెరికా సహకారం లేకపోతే భారతదేశపు సారధ్యంలో జరిగిన జి 20 సమ్మిట్ విజయవంతం కాకపోయ్యేదని డా. జైశంకర్ చెప్పారు. జి20 సదస్సు విజయానికి అమెరికా బాగా సహకరించిందనేది వాస్తవం అంటూ ఈ విషయాన్ని అమెరికాలో పైగా రాజధాని వాషింగ్టన్లో బహిరంగంగా ప్రకటిస్తున్నానని సభికుల హర్షధ్వానాల నడుమ స్పష్టం చేశారు.
ఇరుదేశాల మానవీయ సంబంధాలు పటిష్టంగా ఉండటం వల్లనే ద్వైపాక్షిక సహకారం మరింత విశిష్టం అయిందని కేంద్ర మంత్రి థెయ్ల్పారు. పలు దేశాల నడుమ వాణిజ్య వ్యాపార లావాదేవీలు ఉంటాయని, పరస్పరం విభిన్న రాజకీయాలకు దిగుతూ ఉంటాయని, భౌగోళిక ప్రాంతీయ ఉనికిని చాటుకుంటాయని వివరించారు.
వీటితో పాటు సైనిక సంబంధాలు, సంయుక్త విన్యాసాలు సాగుతాయని, సాంస్కృతిక విషయ వినిమయాలు నెరపుతారని తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటన్నింటిని తలదన్నేలాగా చేసేది దేశాల మధ్య ఉండే మానవీయ సంబంధాలు అని జైశంకర్ తెలిపారు.
భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి చేరుకుని వివిధ వృత్తులలో ఉన్న ప్రవాస భారతీయులు ఇరుదేశాల మధ్య సంబంధాల పటిష్టత దిశలో తమ వంతు కృషి సాగిస్తున్నారని పేర్కొంటూ ఇది అత్యద్భుతం అని విదేశాంగ మంత్రి కొనియాడారు. ఇండో అమెరికన్ల విశిష్ట పాత్రతోనే ఇరుదేశాల నడుమ సంబంధాలు మరింతగా ముందుకు సాగేందుకు అవసరం అయిన ప్రాతిపదికను ఖరారు చేసుకున్నామని తెలిపారు.
భారతదేశం ఇప్పుడు మునుపటి భారతదేశంగా లేదని, ఇది విభిన్నమైనదని, ఈ విస్తారితతను అలవర్చుకుందని స్పష్టం చేశారుచంద్రయాన్ 3 వంటి విజయవంత అంతరిక్ష యాత్రల నిర్వహణ సామర్థం గల దేశంగా మారిందనే విషయాన్ని ఇక్కడికి వచ్చిన వారికి తాను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు.
ప్రపంచవ్యాప్త కోవిడ్ క్లిష్ట దశలో భారతదేశం కేవలం తమ సొంత దేశ ప్రజల గురించే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వందలాది దేశాలకు చేయూత అందించిందని తెలిపారు. ఔషధాలు, సహాయక సామాగ్రి చేరవేత వంటి పలు అంశాలను ప్రస్తావించుకోవచ్చునని చెప్పారు. ఇప్పుడు ఇండియాలో అత్యంత వేగవంతమైన 5జి ప్రక్రియ కూడా నెలకొందని, ఐటి శాస్త్ర సాంకేతిక రంగంలో పరుగులు తీస్తున్న వైనం దీనితో తేటతెల్లం అవుతుందని వివరించారు.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!