రూ. 60కే ‘భారత్ దాల్’ శనగపప్పు!

 
ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కూరగాయలు, పప్పులు, ఉప్పులు సాధారణ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కేజీ శనగపప్పు ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ. 90 గా ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వద్ద శనగ నిల్వలు పేరుకుపోయాయి. అందుకనే సామాన్యులకు ఉపశమనం కలిగించేవిధంగా,  పేరుకుపోయన శనగ నిల్వలను ప్రజా పంపిణీ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు సబ్బిడీపై పప్పును విక్రయించాలని కేంద్రం నిర్ణయంచింది. 
 
తెలంగాణలో ఈ బాధ్యతలను హైదరాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం (హాకా)కు అప్పగించింది. ‘భారత్‌ దాల్‌’ పేరతో ఆదివారం నుంచి హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. 50 వేల టన్నుల శనగ పప్పును హాకా తెలంగాణలో విక్రయించనుంది. 18 రాష్ట్రాల్లో 5000 సంచార వాహనాల ద్వారా విక్రయాలు చేపట్టనుండగా, తెలంగాణలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 200 ఆటోల ద్వారా పప్పును విక్రయించనున్నారు. 
 
ఈ పథకం కింద శనగపప్పు కిలో విడిగా రూ.60కి విక్రయిస్తారు. 30 కిలోల బస్తా తీసుకుంటే కిలో రూ.55 ధరకే లభిస్తుంది. సాదారణ వినియోగదారులతో పాటు దేవాలయాలు, ధార్మిక సంస్థలు, జైళ్లు, పోలీసు శాఖలకు కూడా పప్పును విక్రయించేందుకు కేంద్రం అనుమతించింది.  అవే కాకుండా ప్రభుత్వేతర సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, ఇ-కామర్స్‌ సంస్థలు, చిల్లర, టోకు వ్యాపారులు, ఆసుపత్రులు, సామూహిక వంటశాలలు, ప్రాథమిక సహకార సంఘాలకు సైతం 30 కేజీల పప్పు బస్తాలను విక్రయించనున్నారు. 
 
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌ సింగ్‌, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హాకా ఛైర్మన్‌ ఎం.శ్రీనివాస్‌రావులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. సాధారణ శనగపప్పును బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.90కి విక్రయిస్తుండగా సబ్సిడీ పథకం ద్వారా విక్రయించే భారత్‌ దాల్‌ రూ.60కి లభించనుండటంతో కిలోకి రూ.30 మేర ఆదా అవుతుంది. దేశంలో శనగ నిల్వలు భారీగా పెరిగాయి. 
 
మొదటి దశలో వాటిలో 20 శాతం సబ్సిడీపై విక్రయించేందుకు వీలుగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ మార్కెటింగ్‌ సంస్థలను పరిశీలించింది. తెలంగాణలో హాకాకు ఈ అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.