చంద్రబాబు కేసులో సుప్రీంలో ఏపీ సర్కార్ కేవియట్ పిటిషన్!

స్కిల్ స్కామ్ లో టీటీడీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే హైకోర్టులో ఊరట లభించకపోవటంతో, సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించగా, ఇక్కడ కూడా వాయిదా పడింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్‌ పిటిషన్‌పై విచారణను అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. 
 
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

త్వరలో చంద్రబాబు పిటిషన్ మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉండగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు ఇచ్చే ముందు తమ తరపు వాదనలు కూడా వినాలని పిటిషన్ లో ప్రస్తావించింది. 

స్కిల్‌ స్కామ్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయని తెలిపింది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారని, నిధులను షెల్‌ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్‌ చేసుకున్నారని పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయని, ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీనే అని చెప్పింది. 

ఈ కేసులో తమ తరపున వాదనలను వినిపిస్తామని కేవియట్ పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరింది. కాగా, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 29కు వాయిదా వేసింది. ఇదే కేసులో ఏ14గా ఉన్న నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

మరోవంక, చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు తదుపరి విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5కు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.