చంద్రుడు, సూర్యుడి తర్వాత శుక్రుడిపైకి ఇస్రో ప్రయోగం

అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో వరుస ప్రయోగాలు చేపడుతూ సరికొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే చంద్రుడిపైకి పంపించిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కాగా, సూర్యుడిపైకి ఆదిత్య ఎల్ 1 ను విజయవంతంగా పంపించింది. ఆదిత్య ఎల్ 1 భూకక్ష్యను వదిలి సూర్యుడి వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. 
 
ఈ నేపథ్యంలోనే మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసినట్లు ఇస్రో చీఫ్ డాక్టర్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. తదుపరి ప్రయోగాన్ని ఈసారి శుక్రుడిపైకి పంపించనున్నట్లు తాజాగా వెల్లడించారు. ఈ వీనస్ ప్రయోగానికి సంబంధించిన పేలోడ్‌ను ఇప్పటికే అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఇస్రో వద్ద భవిష్యత్‌లో చాలా ప్రాజెక్టులు ప్రణాళికల్లో ఉన్నాయని, అయితే అవన్నీ ప్రస్తుతానికి పరిశీలన దశల్లోనే ఉన్నాయని సోమ్‌నాథ్ తెలిపారు. 
 
అయితే అందులో శుక్ర గ్రహంపైకి పంపించే ప్రయోగం మాత్రం ప్లాన్ చేసినట్లు ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో సోమనాథ్ ఈ వీనస్ ప్రయోగం గురించిన వివరాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పేలోడ్‌లను ఇప్పటికే అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా శుక్ర గ్రహానికి సంబంధించిన కీలక విషయాలను తెలిపారు. 
 
వీనస్ అనేది ఒక ఆసక్తికరమైన గ్రహమని, ఆ గ్రహంపై పరిశోధనలు జరిపి, సమాచారాన్ని విశ్లేషించడం వల్ల అంతరిక్ష రంగంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని వెల్లడించారు.  ఈ క్రమంలోనే శుక్ర గ్రహంపై ఉండే వాతావరణం చాలా దట్టంగా ఉంటుందని తెలిపారు. భూమి మీది కంటే వీనస్‌పై వాతావరణ పీడనం 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. 
 
ఈ శుక్ర గ్రహం మొత్తం యాసిడ్‌తో నిండి ఉంటుందని, దాని ఉపరితలంపై ఎవరూ అడుగుపెట్టలేరని స్పష్టం చేశారు. ఇక శుక్రుడి ఉపరితలం గట్టిగా ఉందో లేదో ఎవరికీ తెలియదని సోమనాథ్ తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టును ప్రయోగించడం వెనక ఉన్న ప్రధాన కారణాన్ని తెలిపిన సోమ్‌నాథ్ ఒకప్పుడు భూమి కూడా శుక్ర గ్రహంలాగే ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. 
 
10 వేల ఏళ్ల తర్వాత భూమి తన ప్రస్తుత స్వభావాన్ని మార్చుకునే అవకాశం ఉందని, ఎప్పుడూ ఒకేలా ఉండదనే అభిప్రాయాన్ని చెప్పారు. చాలా ఏళ్ల క్రితం భూమి కూడా మనుషులు నివసించేందుకు అనువైన ప్రదేశం కాదని గుర్తు చేశారు. అయితే ఈ శుక్రుడిపైకి పంపించే మిషన్‌కు ఇప్పటివరకు పేరు పెట్టలేదు. అయితే దీనికి ‘శుక్రయాన్’ అనే పేరు పెట్టొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఈ శుక్రయాన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది మొదట్లో ప్రయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అంతరిక్షంలో సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు కాగా, ఇది భూమికి సమీపంలోనే ఉంటుంది. గతంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శుక్రుడిపైకి ప్రయోగాన్ని చేపట్టింది. 2006 నుంచి 2016 వరకు ఆ ప్రయోగం శుక్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. 
 
ఇక జపాన్‌కు చెందిన అకాట్సుకి వీనస్ క్లైమేట్ ఆర్బిటర్ కూడా 2016 నుంచి వీనస్ కక్ష్యలో తిరుగుతోంది. మరోవైపు.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా శుక్రుడిపైకి అనేక ఫ్లైబైలు, ఇతర మిషన్‌లను ప్రారంభించింది.