మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో కర్ఫ్యూ

ఇద్దరు విద్యార్థుల హత్య ఘటన మణిపూర్‌లో తిరిగి అలజడికి దారితీసింది. రాజధాని ఇంఫాల్‌లో ఈ హత్యలకు భారీ స్థాయిలో నిరసనలు వెలువడ్డాయి. దీనితో శాంతిభద్రతల పరిరక్షణకు ఇక్కడ కర్ఫ్యూ విధించారు.  నిరసనకారులు, పోలీసు మధ్య పరస్పరం ఘర్షణలు చెలరేగడంతో ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జికి దిగారు. తర్వాత భాష్పవాయువు ప్రయోగించారు. ఎంతకూ పరిస్థితి అదుపులోకి రాలేదు. తీవ్రస్థాయిలో ఉద్రిక్తత నెలకొంది. దీనితో అధికారులు వెంటనే పట్టణంలో కర్ఫూ విధించారు. 

ఓ బాలిక, బాలుడు జులై నుంచి కన్పించకుండా పొయ్యారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వెలువడ్డాయి. 17 సంవత్సరాల వయస్సున్న ఈ టీనేజర్లు ఓ సైనిక బృందపు జంగిల్ క్యాంపులో కూర్చుని ఉండటం, వీరి వెనుక ఇద్దరు సాయుధులు నిలబడి ఉండటం, తరువాతి ఫోటోలో టీనేజర్లు ఇద్దరూ నేలపై పడిపోయి ఉండటం వంటి దృశ్యాలు ఉన్నాయి. 

ఈ టీనేజర్ల హత్యోదంతం ఇప్పుడు ఘర్షణలకు దారితీసింది. మంగళవారం రాత్రి నుంచి ఇంఫాల్ ఇతర ప్రాంతాలలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఎక్కువగా విద్యార్థులు వీటిలో పాల్గొంటున్నారు. ప్రదర్శనకారులు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అధికారిక నివాసం వైపు దూసుకు వెళ్లేందుకు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. 

హత్యకు గురైన విద్యార్థులు మైయితీ వర్గానికి చెందిన వారిగా భావిస్తున్నారు. కంగ్లా ఫోర్టు వద్ద నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. సిఎం నివాసానికి ఇది దరిదాపుల్లో ఉన్న ప్రాంతం కావడంతో పరిస్థితి ఎప్పటికప్పుడు ఉద్రిక్తంగా మారుతోంది. బుధవారం పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు.

కాగా, ఇద్దరు విద్యార్థుల మృతికి సంబంధించి సీబీఐ దర్యాప్తునకు నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ప్రకటించారు. దర్యాప్తు కోసం సిబిఐకి చెందిన ప్రత్యేక డైరెక్టరుతో కూడిన బృందం ఒకటి బుధవారం ఉదయం ఇంఫాల్‌కు చేరుకుంది. సీబీఐ దర్యాప్తునకు సిఎం నిర్ణయించడం పట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 

మణిపూర్‌లో ఈ ఏడాది మే నెల 3 నుంచి జరుగుతున్న తెగల మధ్య ఘర్షణలు చల్లారకుండా రగులుతూ ఉండటం జాతీయ స్థాయిలో ఆందోళనకరం అయింది. ఈ ఘర్షణల దశ నుంచి ముఖ్యమంత్రి పలు విషయాలపై పక్షపాత ధోరణిని అవలంభిస్తూ వస్తున్నారని రాష్ట్రంలోని కొన్ని తెగల వారు విమర్శిస్తున్నారు.