ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు జరిగిన 51.91 బిలియన్ యూపీఐ లావాదేవీల్లో పీ2ఎం లావాదేవీలు 29.15 బిలియన్లుగా ఉన్నాయి. మొత్తం లావాదేవీల్లో ఇది 56.1 శాతంగా ఉంది. మిగిలి 22.75 లావాదేవీలు పర్సన్ టూ పర్సన్ (పీ2పీ)గా ఉన్నాయి. లావాదేవీల విలువ పరంగా కూడా పర్సన్ టూ మర్చంట్ లావాదేవీలు శరవేగంగా పెరుగుతున్నాయి.
ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో పర్సన్ టూ పర్సన్ లావాదేవీలు 41 శాతం పెరిగితే, పర్సన్ టూ మర్చంట్ లావాదేవీలు 119 శాతం పెరిగాయి. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఫీజులు వసూలు చేయకపోవడంతో ఈ చెల్లింపులను అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు ఇద్దరూ ఈ చెల్లింపుల పట్ల మొగ్గు చూపుతున్నారని నివేదిక పేర్కొంది.
దీని వల్ల భారత్ లో పేమెంట్ మెకానిజం విజయవంతంగా నడుస్తున్నట్లు తెలిపింది. వ్యాపారుల విషయానికి వస్తే చెల్లింపుల విషయంలో భద్రత, సరైన సమయంలో చెల్లింపులు వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పర్సన్ టూ మర్చంట్ చెల్లింపులు పెరుగుతున్నందున యూపీఐ వీటిని మరింత విస్తృతం చేయనుంది. లావాదేవీలు జరిగేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా యూపీఐ అన్ని చర్యలు తీసుకుంటోంది.
యూపీఐ చెల్లింపుల్లో సరాసరి టికెట్ సైజ్ (ఏటీఎస్) అంటే ఒక చెల్లింపు సరాసరి విలువ 2023 మొదటి ఆరు నెలల కాలంలో 1,604 రూపాయలుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఇది కొంత తక్కువగా ఉంది. గత సంవత్సరం ఇది 1,774 రూపాయలుగా ఉంది.
ఈ సంవత్సరం ఆరు నెలల కాలంలోనే లావాదేవీలు 62 శాతం పెరగడం అంటే, యూపీఐని వినియోగిస్తున్న వారి సంఖ్య గననీయంగా పెరగడమే. ఇందులో చిన్న మొత్తంలో చెల్లించే లావాదేవీలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు యూపీఐ వ్యాప్తి ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. యూపీఐ చెల్లింపులను అంగీకరించే చిన్న వ్యాపారులు కూడా పెరగడం ఇందుకు కారణమని పేర్కొంది.
విలువ పరంగా చూస్తే ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో 47 శాతం పెరిగి, 83.17 లక్షల కోట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి 56.59 లక్షల కోట్లుగా ఉన్నాయి. పర్సన్ టూ మర్చంట్ చెల్లింపులు పెరగడం మంచి సూచికని నివేదిక తెలిపింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం మూడు సంస్థల లావాదేవీల్లోనూ95.68 శాతం యూపీఐ లావాదేవీలే ఉన్నాయని నివేదిక తెలిపింది.
ఈ సంవత్సరం జూన్ 30 నాటికి ఈ సంస్థల లావాదేవీల్లో వాల్యూమ్ పరంగా చూస్తే యూపీఐ చెల్లింపులు 93.65 శాతంగా ఉన్నాయి. ఈ మూడు సంస్థల మొత్తం లావాదేవీల్లో ఫోన్ పే వాటా గత సంవత్సరం 45.8 శాతంగా ఉంటే, ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ఇది స్వల్పంగా పెరిగి 47.2 శాతంగా ఉంది.
లావాదేవీల విలువ పరంగా చూస్తే ఫోన్ పే మార్కెట్ వాటా 48.8 శాతం నుంచి 49.8 శాతానికి పెరిగింది. లావాదేవీల పరంగా గూగుల్ పే వాటా తగ్గిపోయింది. గత సంవత్సరం 34 శాతం ఉన్న వాటా ఈ సంవత్సరం 13.8 శాతానికి తగ్గింది. గూగుల్ పే వాటాను పేటీఎం సాధించింది. పేటీఎం లావాదేవీలు గత సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో 14.7 శాతంగా ఉంటే, ఈ సంవత్సరం ఇదే కాలంలో 34.6 శాతానికి పెరిగింది. లావాదేవీల విలువ పరంగా చూసతే గూగుల్ పే మార్కెట్ వాటా గత సంవత్సరం 34.6 శాతం ఉంటే, ఈ సంవత్సరం అది 10.9 శాతానికి చేరింది.
More Stories
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు!
30 మంది ఉద్యోగులను తొలగించిన ఎయిర్ఇండియా
జిహాద్ కు, అభివృద్ధికి మధ్య ఎన్నికలు