రైల్వే ప్రమాదాలలో పరిహారం 10 రేట్లు పెంపు

రైలు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పది రెట్లు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రైలు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు కేవలం రూ. 50,000 మాత్రమే ఇచ్చేవారు. కాని కొత్తగా రైల్వే బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పది రెట్లు, అంటే ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వనుంది.

రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి రూ. 2.5 లక్షల పరిహారం అందజేయనుంది రైల్వే బోర్డు. ఇక స్వల్ప గాయాలపాలైన ప్రయాణికులకు రూ. 50,000 ఇస్తామని ప్రకటించింది. అంతే కాకుండా తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన ప్రయాణికులకు రోజు వారి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని రైల్వే ప్రకటించింది. 

అది కూడా 30 రోజులకు మించి ప్రయాణికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటూ అతనికి రోజుకు 3వేల చొప్పున పరిహారం చెల్లించనున్న‌ట్టు తెలిపింది. రైలు ప్రమాదాలతో పాటు సిగ్నల్స్,కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ వద్ద జరిగే ప్రమాదానికి గురైన వారికి పెంచిన పరిహారం అందజేయాలని రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు తక్షణం అమల్లోకి వచ్చాయి.

గతంలో రైలు ప్రమాదాలలో గాయపడిన వారికి కేవలం రూ. 5,000 పరిహారం మాత్రమే ఇచ్చేది రైల్వే బోర్డు. ఇప్పుడు దాన్ని కూడా 10 రెట్లు పెంచింది. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి 10రోజులకు ఒకసారి ఎక్స్‌గ్రేషియా చెల్లించనుంది. ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనలు, రైళ్లలో దోపిడీలు వంటి అవాంఛిత ఘటనల సమయంలో ఈ పరిహారాలు వరుసగా రూ.1.50 లక్షలు, రూ.50 వేలు, రూ. 5 వేలుగా నిర్ణయించారు. సెప్టెంబర్‌ 18న జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వులు వెంటనే ఆచరణలోకి వస్తాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.