శక్తివంతమైన సౌర రేణువులపై ఆదిత్య ఎల్1 అధ్యయనం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఆదిత్య ఎల్1 సూర్యుని వైపుగా ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి నుంచి అంతరిక్షంలోగల సౌరపవనాల్లోని అత్యంత శక్తివంతమైన రేణువులను అధ్యయనం చేయడం మొదలు పెట్టిందని, నిరంతరం అదే పరిశోధనలో ఉంటుందని సీనియర్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త వెల్లడించారు. 

ఆదిత్య ఎల్1లో అమర్చిన సూప్రా థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ (ఎస్‌టిఇపిఎస్) అనే సాధనం ద్వారా ఈ అధ్యయనం సాగుతుంది. ఈ సాధనం ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఎఎస్‌పిఇఎక్స్) పేలోడ్‌లో భాగమే. స్పెక్ట్రోమీటర్ ఇప్పుడు అంతరిక్షం నుంచి పనిచేస్తోంది.  ఆదిత్య ఎల్1 భూమికి 52,000 కిమీ ఎత్తులో ఉన్నప్పుడు సెప్టెంబర్ 10 నుంచి భూమి అయస్కాంత క్షేత్ర పరిధిలో పనిచేస్తూనే ఉందని శాస్త్రవేత్త దివ్యేందు చక్రవర్తి చెప్పారు.

ఫిజికల్ రీసెర్చి లాబొరేటరీలో స్పేస్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా చక్రవర్తి పనిచేస్తున్నారు.  అహ్మదాబాద్‌కు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ సాయంతో ఫిజికల్ రీసెర్చి లాబొరేటరీ ఈ స్పెక్ట్రోమీటర్‌ను రూపొందించింది. ఆదిత్య ఎల్1 తన గమ్యం చేరేవరకు నాలుగునెలల ప్రయాణ సమయంలో సౌరపవనాల్లోని శక్తివంతమైన రేణువుల గురించి అధ్యయనం చేస్తుందని చక్రవర్తి వివరించారు.

ఈమేరకు లభించే డేటా వల్ల అంతరిక్షంలోని ఆస్తులకు ఎలాంటి నష్టం లేకుండా కాపాడుకోడానికి వీలవుతుందని తెలిపారు. లాగ్‌రేంజియన్ పాయింట్ 1 నుంచి వ్యోమనౌక ద్వారా పర్యావరణం లోని శక్తివంతమైన రేణువులను అధ్యయనం చేయడమే స్పెక్ట్రోమీటర్ లక్షంగా చక్రవర్తి వివరించారు. ఈ స్పెక్ట్రోమీటర్‌కు ఆరు సెన్సార్లు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటీ వివిధ దిక్కుల్లో అధ్యయనం చేస్తుంటాయి.

సూప్రాథర్మల్, శక్తివంతమైన అయాన్లను లెక్కిస్తుంటాయి. భూకక్షల్లో ఉన్నప్పుడు సేకరించిన డేటా భూమి చుట్టూ ఆవరించి ఉన్న శక్తివంతమైన రేణువుల చర్యలను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వీటి అయస్కాంత క్షేత్రంలో వీటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది.