మణిపూర్‌ నటి సోమ లైశ్రమ్‌పై మూడేళ్ల నిషేధం

అందాల పోటీల్లో పాల్గొన్న మణిపూర్‌ నటిపై ఇంఫాల్‌కు చెందిన ఓ సంస్థ సినిమాలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా మూడేళ్ల పాటు నిషేధం విధించింది. హింసాకాండలో మణిపూర్‌ రగిలిపోతున్న విషం తెలిసిందే. అయితే, హింసాకాండ చల్లారేంత వరకు వినోద కార్యక్రమాల్లో పాల్గొనకుండా నటీ నటులు దూరంగా ఉండాలని కంగ్లీపాక్ కాన్బా లూప్  గ్రూప్‌ ఫిల్మ్‌ యాక్టర్స్‌ గిల్డ్‌కు పిలుపునిచ్చింది. అలాగే వ్యక్తిగతంగా సూచనలు చేసింది.

అయితే, ఈ పిలుపునకు వ్యతిరేకంగా సోమ లైశ్రమ్‌ ఈ నెల 16న ఢిల్లీలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్నట్లు ఆ గ్రూప్‌ పేర్కొంది. రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలు చెలరేగుతున్న పరిస్థితుల్లో సోమ పోటీల్లో పాల్గొనడం ప్రజలతో పాటు గ్రూప్‌కు సైతం నచ్చలేదు. అయితే, విజ్ఞప్తిని పట్టించుకోండా అందాల పోటీల్లో పాల్గొనడంతో నిషేధంను విధించింది. 

అయితే, నిషేధం వ్యవహారంపై నటి స్పందిస్తూ పోటీలను మణిపూర్‌ పరిస్థితిపై మాట్లాడేందుకు వేదికగా ఉపయోగించుకున్నట్లు పేర్కొంది.అల్లర్లు చెలరేగుతున్న రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసినట్లు సోమ లైశ్రమ్‌ తెలిపారు.  మీడియాతో మాట్లాడుతూ ఓ నటిగా మణిపూర్‌ సంక్షోభంపై మాట్లాడడం తన బాధ్యత అని, ఇందుకు అందాల పోటీల వేదికను ఎంచుకున్నట్లు వెల్లడించింది. తాను పాల్గొన్న ఈవెంట్‌ లాభాపేక్ష లేని సంస్థ అని, ఇది వినోదం, పార్టీ కోసం నిర్వహించిన ష్యాషన్‌ కాదని స్పష్టం చేసింది.

 ప్రతి రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యక్తి ప్రాతినిధ్యం వహించే సాంస్కృతిక కార్యక్రమని చెప్పింది. తాను మణిపూర్‌కు చెందిన వ్యక్తిని కావడంతో తనను పిలిచారని, ఈ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదని ఆమె తెలిపారు. సోమ లైశ్రమ్‌ దాదాపు 150 మణిపూర్‌ చిత్రాల్లో నటించారు. అనేక అవార్డులను సైతం ఆమె అందుకున్నారు. శనివారం న్యూఢిల్లీలో నిర్వహించిన నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఫెస్టివల్‌లో షోస్టాపర్‌గా సోమ పాల్గొన్నారు. సోమకు మద్దతుగా పలువురు అభిమానులు మద్దతు తెలిపారు. జాతీయ వేదికపై రాష్ట్ర సంక్షోభాన్ని లేవెత్తారని పలువురు ఆమెను ప్రశంసించారు.