తెలంగాణకు ఆరు గ్యారంటీలను ప్రకటించిన సోనియా గాంధీ

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తుక్కుగూడ  బహిరంగ సభలో ఆదివారం ప్రకటించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రకటించిన ఐదు గ్యారంటీలు గెలుపుకు తోడ్పడంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఐదు రాష్ట్రాలలో జరుగనున్న రాస్త్రాలలో సహితం అదే వ్యూహం అమలు పరుస్తున్నారు. 

 ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ తెలంగాణలో ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అమలు చేస్తామని ఆమె తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, అప్పుడే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని, ఇదే తన కోరిక అని సోనియా గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజల అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని చెబుతూ . కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని తెలంగాణ ప్రజలను ఆమె కోరారు.

ఆరు గ్యారంటీలు ఇవే….
1. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500ల సాయం. ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం. రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్.
2. రైతు భరోసా రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000ల పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000ల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500ల బోనస్.
3. గృహజ్యోతి -ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్
4. ఇందిరమ్మ ఇళ్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయింపు.
5. యువ వికాసం – విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
6. చేయూత – నెలకు రూ. 4,000 చొప్పున పింఛను. రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా.

కాగా, రాజకీయాల్లో ఎవరితో పోరాడుతున్నామో అవగాహన ఉండాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. మనకు వ్యతిరేకంగా ఉన్న శక్తుల గురించి తెలిసి ఉండాలని, తెలంగాణలో కేవలం బిఆర్‌ఎస్‌తో మాత్రమే కాంగ్రెస్ పోరాడటం లేదని, బీజేపీ, మజ్లిస్ పార్టీలతో కూడా పోరాడుతున్నామని ఆయన చెప్పారు. 

తాము వేర్వేరు పార్టీలని బిఆర్‌ఎస్, బిజెపి, మజ్లిస్ చెప్పుకుంటాయని, కానీ ఈ మూడు పార్టీలు కలిసే ఉంటాయని ఆయన ఆరోపించారు. ప్రజలకు గ్యారంటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసిందని చెబుతూ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆరు గ్యారెంటీలను ఇస్తోందని, వాటిని అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.