వీసా ఫీజు భారీగా పెంచిన బ్రిటన్‌ ప్రభుత్వం

వీసా దరఖాస్తుదారులకు భారత్‌లోని అమెరికా ఎంబసీ అలర్ట్‌ జారీచేసింది. దరఖాస్తు రుసుం మొత్తం చెల్లించినప్పటికీ, నిర్ణీత సమయానికి వీసా ఇంటర్వ్యూకి హాజరుకాకపోతే గడువు ముగిసినట్టుగానే పరిగణిస్తామని యూఎస్‌ ఎంబసీ తాజాగా పేర్కొన్నది. 2022, అక్టోబర్‌ 1 కంటే కంటే ముందు వీసా అప్లికేషన్‌ ఫీజు మొత్తం చెల్లించి, ఇంకా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ చేసుకోని వారు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీలోగా వెంటనే ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ను షెడ్యూల్‌ చేసుకోవాలని సూచించింది. 

ఈ మేరకు తాజాగా ఎక్స్‌ పోస్టు అలర్ట్‌ సందేశం ఇచ్చింది. సెప్టెంబర్‌ 30లోగా ఇంటర్వ్యూకు హాజరయ్యే విధంగా బుకింగ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని, అయితే తర్వాతి నెలల్లో ఇంటర్వ్యూకు వెళ్లేందుకు అనుగుణంగా సిస్టమ్‌లో ముందు అపాయింట్‌మెంట్‌ను షెడ్యూల్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణంగా వీసా దరఖాస్తుదారులు ఫీజు చెల్లించిన తర్వాత ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ను షెడ్యూల్‌ చేసుకొనేందుకు ఏడాది సమయం ఉంటుంది. ఫీజు చెల్లింపు తర్వాత 365 రోజుల్లోగా అపాయింట్‌మెంట్‌ను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే పేమెంట్‌ గడువు ముగిసిపోయినట్టుగా భావిస్తారు.

అయితే ఈ విషయంలో కరోనా సంక్షోభం సమయంలో కొన్ని మినహాయింపులు, పొడిగింపులు ఇచ్చారు. ఈ మినహాయింపులు సెప్టెంబర్‌ 30తో ముగిసిపోతున్నాయని ఎంబసీ తెలిపింది. మరోవైపు భారత్‌తో సహా ఇతర దేశాల పర్యాటక, స్టూడెంట్‌ వీసా దరఖాస్తుదారులకు యూకే ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది.

రెండు వీసాల దరఖాస్తుల ఫీజులను పెంచేసింది. స్టూడెంట్‌ వీసాపై అయితే భారీగా రూ.13,070(127 పౌండ్లు) పెంచింది. ఆరు నెలల లోపు పర్యాటక వీసాకు దరఖాస్తు ఫీజును రూ.1,543(15 పౌండ్లు) పెంచుతూ అక్కడి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకొన్నది. పెంచిన కొత్త ఫీజులు అక్టోబర్‌ 4 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని యూకే విదేశాంగ శాఖ పేర్కొన్నది. 

తాజా పెంపు తర్వాత ఆరు నెలల లోపు యూకే విజిట్‌ వీసా దరఖాస్తు రుసుం రూ.11,835(115 పౌండ్లు)కు, స్టూడెంట్‌ వీసా ఫీజు రూ.50,428(490 పౌండ్లు) చేరిందని తెలిపింది. హెల్త్‌, కేర్‌ వీసాలను కూడా పెంచారు.