సాక్ష్యాలు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

తన భార్య రింకి భుయాన్ శర్మ కానీ, ఆమెకు సంబంధించిన కంపెనీకి కానీ కేంద్రం నుంచి ఎలాంటి సబ్సిడీ అందలేదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పునరుద్ఘాటించారు. తన భార్య కానీ, ఆమెకు సంబంధించిన కంపెనీ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్ అందుకున్నట్లు ఎలాంటి సాక్షం ఉన్నా రాజకీయాలనుంచి రిటైర్ కావడంతో సహా ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. 

‘ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా నా భార్యకు కానీ, ఆమెకు సంబంధించిన కంపెనీకి కానీ కేంద్రంనుంచి ఎలాంటి సబ్సిడీ అందలేదని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను. దీనికి సంబంధించి ఎరైనా సాక్ష్యం అందజేస్తే ప్రజా జీవితంనుంచి శాశ్వతంగా తప్పుకోవడంతో సహా ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా’ అని హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(గతంలో ట్విట్టర్)లో చేసిన ఓ పోస్టులో ప్రకటించారు.

ఈ సబ్సిడీకి సంబంధించి తొలుత కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ బుధవారం సోషల్ మీడియాలో అనుమానాలు లేవనెత్తడంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్ర పథకమైన ‘ పిఎం కిసాన్ సంపద యోజన’ పథకం కింద హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మకు చెందిన ‘ ప్రైడ్ ఈస్ట్ ఎం ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రూ.10 కోట్ల సబ్సిడీతో కూడిన రుణం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. కేంద్ర ఆహార వాఖకు చెందిన వెబ్‌సైట్‌లోనే దీనికి సంబంధించిన సమాచారం వెలువడింది. దీంతో ఈ వ్యవహారం అసోంలో తీవ్ర రాజకీయ సంచలనం రేపుతోంది.‘