డీజిల్ వాహనాల పై అదనంగా 10% పన్ను?

కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. స్వచ్ఛమైన ఇంధనాలను ఉపయోగించే వాహనాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెబుతూ అదే విధంగా, కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ ఇంజన్ వాహనాలకు చెక్ పెట్టే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

కాలుష్య పూరిత వాహనాల అమ్మకాలను నిరోధించే లక్ష్యంతో డిజిల్ ఇంజన్ వాహనాలపై 10% పన్ను అదనంగా విధించాలని త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు త్వరలో ప్రతిపాదిస్తానని నితిన్ గడ్కరీ వెల్లడించారు. కాలుష్య పన్ను పేరుతో ఆ పన్నును వసూలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రికి సూచించనున్నానని తెలిపారు. అయితే, వెంటనే ఆ విధంగా పన్ను విధించే ఆలోచన లేదని ఆ తర్వాత మంత్రి వివరణ ఇచ్చారు.

ఈ నిర్ణయం వల్ల డీజిల్ వాహనాల ధరలు పెరిగి, వాటిని కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య తగ్గుతుందని, దాంతో, వాహన తయారీ సంస్థలు ఆయా వాహనాల ఉత్పత్తిని తగ్గిస్తాయని గడ్కరీ వివరించారు. డీజిల్ వాహనాల వల్ల కాలుష్యం పెరగడమే కాకుండా, ఇంధన దిగుమతి వ్యయం కూడా భారీగా పెరుగుతుందని చెప్పారు.

 డీజిల్ కార్ల తయారీదారులు తమ ఉత్పత్తిని తగ్గించుకోకపోతే వాటిపై పన్ను వేయడం తప్పా ప్రభుత్వానికి వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. తద్వారా కార్ల ధరలు ఆకాశాన్నంటుతాయని అలా అయినా వాటి అమ్మకాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ‘డీజిల్ కు గుడ్ బై చెప్పండి. వాటిని ఉత్పత్తి చేయడం నిలిపివేయండి. అలా చేయకపోతే, మేమే వాటిపై పన్నును పెంచుతాం’ అని గడ్కరీ హెచ్చరించారు.

ప్యాసెంజర్ కార్ల కన్నా భారీ వాహనాలు, జనరేటర్లు ఎక్కువగా డీజిల్ పై నడుస్తాయని గుర్తు చేశారు. 2070 వరకు డీజిల్ తదితర కాలుష్యాన్ని వెదజల్లే వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించేలా లక్ష్యం పెట్టుకున్నామని గడ్కరీ వెల్లడించారు. వీటిని తగ్గిస్తూనే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వాహనాల తయారీని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. డీజిల్ కార్ల సంఖ్య 2014లో 53 శాతం ఉండగా, 2023 నాటికి అవి 18 శాతానికి పడిపోయాయని చెబుతూ ఇది మంచి సంకేతమని ఆయన చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటూ ఇప్పటికే మారుతీ సుజుకీ, హోండా వంటి కార్ల తయారీ సంస్థలు డీజిల్ ప్యాసింజర్ వాహనాల తయారీని నిలిపేశాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

స్టాక్స్ కుప్పకూలడంతో మంత్రి వివరణ

కాగా, మంగళవారం ఎస్ఐఏఎం 63వ వార్షిక సమావేశంలో నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే స్టాక్ మార్కెట్లోని ఆటో స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. భారీ వాహనాలు, కమర్షియల్ వాహనాలు, ఎస్యూవీలు, ఎంపీవీలు ఎక్కువగా డీజిల్ వాహనాలుగానే ఉంటాయి.  మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి మారుతి సుజుకీ షేర్ విలువ రూ. 72.90 తగ్గింది. టాటా మోటార్స్ షేర్ విలువ రూ. 16.70 లేదా 2.63% తగ్గింది. ఐశ్చర్ మోటర్స్ షేర్ విలువ రూ. 46.80 లేదా 1.37% తగ్గింది.

కాగా, తన వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపడంతో, వెంటనే వాటిపై ట్విటర్ లో నితిన్ గడ్కరీ వివరణ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు డీజిల్ వాహనాలపై పన్ను పెంచే ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ లేదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆటోమొబైల్ ఉత్పత్తులపై 28% వరకు జీఎస్టీ ఉంది. అదనంగా 1% నుంచి 22% వరకు వెహికిల్ టైప్ ను బట్టి సెస్ ఉంటుంది. ముఖ్యంగా ఎస్యూవీలపై గరిష్టంగా 28% జీఎస్టీ, 22% సెస్ ఉంటుందని వివరించారు.