మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పర్యటనలో భాగంగా నంద్యాలలో బస చేస్తున్న ఆయనను పోలీసులు శనివారం ఉదయమే తమ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.
 
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును నిందితునిగా చేర్చి, అరెస్ట్ వారంట్ పొందిన్నట్లు తెలుస్తున్నది. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్‌ చేశారు పోలీసులు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసినట్లు నోటీసుల్లో ప్రస్తావించారు. ఈ కేసులో ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు సిఐడి పోలీసులు. చంద్రబాబు కు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించనున్నారు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా, కోర్టులో కేసు విచారణ జరుగుతన్న సమయంలో తనను ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.
కేసు పేపర్లు ఇవ్వాలని, ఎఫ్ఐఆర్ కాపీని చూపించాలని లాయర్లు కోరగా, రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడం కుదరదని పోలీసులు తెలిపారు. అరెస్ట్‌కు కారణాన్ని పోలీసులు వివరించారు. చంద్రబాబు పాత్ర ఉందని కోర్టుకు వివరించామని తెలిపారు. దీంతో స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్‌లో తన పేరు ఎక్కడుందో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. కానీ తాము ప్రొసీజర్ ప్రకారమే ముందుకు వెళుతున్నామని అధికారులు స్పష్టం చేశారు.
ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని లాయర్లు ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్‌ పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. తనని అరెస్టు చేసే ముందు ఆ పత్రాలను ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి పట్టుబడగా,  అరెస్టు చేశాక తగిన పత్రాలు ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. దేని గురించి అరెస్టు చేస్తారనే అడిగే హక్కు సామాన్యులకు కూడా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
 
అరెస్టు నోటీసులు ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. డీకే బసు కేసు ప్రకారం వ్యవహరించామని పోలీసులు చెబుతున్నారు. 24 గంటల్లో అరెస్టుకు కారణాలతో కూడిన పత్రాలు ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. అవగాహన లేకుండా లాయర్లు వ్యవహరిస్తున్నారని పోలీసులు అనగా, పోలీసుల తీరే అవగాహన లేకుండా ఉందని చంద్రబాబు మండిపడ్డారు.


నంద్యాల పర్యటనలో ఉన్న బాబు ఆర్‌.కె ఫంక్షన్‌ హాల్‌‌లో బస చేశారు. శుక్రవారం రాత్రి బస చేసిన ప్రాంతానికి డీఐజీ రఘురామిరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డితోపాటూ ఇతర పోలీస్ అధికారులు అక్కడికి వచ్చారు.. అప్పటి నుంచి హైడ్రామా నడిచింది. తెల్లవారుజామున 3 గంటలకే చంద్రబాబు బసచేస్తున్న వాహనంలోకి ప్రవేశించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయనకు రక్షణగా ఉంటున్న ఎస్పీజీ అధికారులు అభ్యంతరం తెలిపారు.
ఉదయం బైటకు వచ్చిన చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపపు నంద్యాలలో ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసి టీడీపీ కేడర్ ఆర్కే ఫంక్షన్‌ హాల్‌ వద్దకు భారీగా తరలివచ్చాయి. శనివారం ఉదయం 5 గంటల తర్వాత చంద్రబాబు బస చేస్తున్న వాహనం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.
వాహనం చుట్టూ ఉన్న టీడీపీ నేతలను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితర స్థానిక టీడీపీ నేతలు ఉన్నారు. అరెస్టు అయిన వారిలో భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితర స్థానిక టీడీపీ నేతలు ఉన్నారు.