కొలకలూరి ఇనాక్ కు ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్!

అసాధారణ సాహితీమూర్తి పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్ గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1959లో అదే యూనివర్సిటీ నుంచి బి.ఎ. ఆనర్స్ పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా ప్రస్థానం ప్రారంభించిన ఇనాక్ తన 85వ ఏట అదే విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు.

దళిత భూమి లోంచి చొచ్చుకు వచ్చి ఎన్నో కష్టాలు వివక్షలు ఎదుర్కొని ఎదురీది సాహితీ విద్యా వట వృక్షం గా మారిన ఇనాక్ గొప్ప ఆదర్శ ప్రదాత. ఆరున్నర దశాబ్దాలుగా అలుపెరుగని సాహితీ సేద్యం చేస్తున్న గొప్ప రచయిత.  సాహిత్య రంగంలో అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన సాహితీవేత్త.  పిహెచ్ డి చేసిన శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికే వైస్ ఛాన్స్-లర్ అయిన మహా మేధావి, అంతకు మించిన గొప్ప మానవతామూర్తి ఇనాక్. 

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నుంచి కూడా ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అత్యున్నత స్థాయికి చేరినా మూలాలను మరచిపోని స్ఫూర్తి శిఖరం ఆయన.  ఆయన తెలుగు రచయిత, సాహితీకారుడు, కవి.తెలుగు  పదాలకు వెలుగులద్దిన పదనిర్దేశి. ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి.
వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి. ఆయన  చేసిన కృషికి గుర్తింపుగా 2014 లో భారత ప్రభుత్వం `పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. 2015లో భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం  ఆయనకు “అనంత జీవనం” అనే రచనకు లభించింది.  ఆయన గుంటూరు  జిల్లా వేజెండ్ల గ్రామంలో నిరుపేద కుటుంబీకులైన రామయ్య, విశ్రాంతమ్మ దంపతుల సంతానంగా, 1939 జూలై 1 న జన్మించారు. ”
గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం, తిరుపతి   వంటి ప్రదేశాలలో తెలుగు ఆచార్యుడుగా పనిచేసి, అంచెలంచెలుగా ఎదుగుతూ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవి అందుకున్నారు. 1954లో లోకంపోకడ, ఉత్తరం అనే కథానికలతో తెలుగు సాహితీ లోకంలో చేరారు. 1958లో “దృష్టి” అను నాటికను వ్రాసి, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతిని అందుకున్నారు.
1965లో “జైహింద్” నాటికకు రాష్ట్రప్రభుత్వ బహుమతిని దక్కించుకున్నారు. 1986లో వ్రాసిన “ఊరబావి” కథాసంపుటి, రచయితగా ఆయన స్థానాన్ని చాటిచెప్పినది. 1988లో “మునివాహనుడు” కథాసంపుటికి మరోసారి కేంద్ర సాహిత్య అకాడమీ  పురస్కారం లభించింది. ఈ రకంగా రెండు సార్లు ఈ పురస్కారాన్ని అందుకున్న అరుదైన రచయితగా ప్రసిద్ధిచెందినారు
 
ఎలాంటి భేషజాలు వుండవు. ఎంతో ఒదిగి ఉంటారు. ఎంతో ప్రేమగా ఆత్మీయంగా పలకరిస్తారు. ఎప్పుడైనా ఏ కార్యక్రమానికి పిలిచినా “వస్తున్న” అని వెంటనే చెప్పడమే కాకుండా, కార్యక్రమం రోజున ఖచ్చితంగా సమయానికి వచ్చేస్తారు.  సందర్భోచితంగ చక్కగా ప్రసంగిస్తారు. చక్కటి పంచెకట్టులో, చెదరని చిరునవ్వుతో ఉట్టిపడే ప్రేమ కళ్ళతో నిలువెత్తు తెలుగు సంతకంలా కనిపిస్తారు.

చదివిన యూనివర్సిటీలో, చదువు చెప్పిన యూనివర్సిటీ లో ప్రతిష్టాత్మక గౌరవం పొందడం అంటే హిమాలయాల అంచులను తాకిన సంబరమే. ఒకరిద్దరికి మాత్రమే లభించే అరుదైన మహా గౌరవం ఇది.  ఆంధ్ర విశ్వవిద్యాలయం 90వ స్నాతకోత్సవం సందర్బంగా ఈనెల 9న విశాఖ యూనివర్సిటీ ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం జరగనున్నది.