ఉదయనిది స్టాలిన్ ను వెంటనే అరెస్టు చేయాలి

హిందూ ధర్మాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చిన తమిళనాడు మంత్రి, డీఎంకే యువజన విభాగం అధినేత ఉదయనిది స్టాలిన్ ను వెంటనే అరెస్టు చేయాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ విభాగం డిమాండ్ చేసింది. రాజ్యాంగానికి కట్టుబడి కుల మత, రాగద్వేషాలకు అతీతంగా సకల జనుల శ్రేయస్సు కోసం పని చేస్తానని ప్రమాణం చేసిన మంత్రి కంత్రి పనులు చేయడం సమంజసం కాదని పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమిళనాడులో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందా? లేక పరమ పవిత్రుడైన  శ్రీరామచంద్రుడినే అవమానించిన కరుణానిధి రచించిన రాజ్యాంగం నడుస్తుందా? అని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనుషుల మధ్య విద్వేషాలు సృష్టించడం ఉదయనిదికి తగదని వారు హెచ్చరించారు. 

విచ్ఛిన్నం, విధ్వంసం నేటి ఆధునిక సమాజంలో పనికిరావని తేల్చి చెప్పారు. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని అనేక కుట్రలు పన్నిన మహమ్మదీయులు, ఆంగ్లేయులు కాలగర్భంలో కలిసిపోయారనే విషయం గుర్తు చేసుకోవాలని హితవు చెప్పారు. హిందూ ధర్మం శాశ్వతమైనదని దానికి మరణం లేదనే విషయం పరిషత్ నేతలు గుర్తు చేశారు. 

అన్ని కులాలు, మతాలను గౌరవించే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడిన ఉదయనిది స్టాలిన్ ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి, కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.  సనాతన ధర్మంపై అడ్డమైన కూతలు కూస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉందని వారు హెచ్చరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు.