ఎప్పటికైనా అత్యవసరమైన ప్రపంచ శాంతిని గాంధేయ మార్గంతో సాధించుకోవచ్చునని, తద్వారా శాంతిని పొందవచ్చునని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. జాతిపిత స్థారక స్థలి రాజ్ఘాట్లో రాష్ట్రపతి సోమవారం 12 అడుగులు ఎతైన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి గాంధీ ధర్శన్లో నెలకొన్న మహాత్మా భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత రాష్ట్రపతి మాట్లాడుతూ గాంధీజీ వసుధైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని విశ్వసించారని, ఈ విధంగా ప్రపంచ మంతా ఒక్కటే అని చాటి చెపుతూ సహోదరభావాన్ని నెలకొల్పారని రాష్ట్రపతి తెలిపారు.
త్వరలోనే భారతదేశం ఆధ్వర్యంలో జి 20 సదస్సు జరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీ ఇందుకు వేదిక కానుంది. భారతదేశం పలు విధాలుగా ప్రపంచ స్థాయి సౌభాతృత్వాన్ని, సహకారాన్ని, శాంతిసంక్షేమాలను ప్రోత్సహించేందుకు పాటుపడుతోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీజీ ఈ మానవాళికి దక్కిన అమూల్యమైన కానుక అని ఆమె తెలిపారు.
గాంధీజీ జీవిత ఆశయాలే ఈ ప్రపంచానికి మార్గదర్శకాలు అయ్యాయని పేర్కొంటూ ఆయన విలువలు , ఆలోచనలు సిద్ధాంతాలు ఈ ప్రపంచ గతిని మార్చేవిగా ఉన్నాయని రాష్త్రపతి తెలిపారు. దక్షిణాఫ్రికాలోని నెల్సన్ మండేలా మొదలుకుని పౌర హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్, బరాక్ ఒబామా వంటి వారు మహాత్మా గాంధీ ప్రబోధించిన అహింసా మార్గాన్ని కొనియాడారని ఆమె గుర్తు చేశారు.
ప్రపంచస్థాయి ప్రగతి విలసిల్లేందుకు ఈ అహింస మార్గదర్శి అవుతుందని తెలిపారని రాష్ట్రపతి గుర్తు చేశారు. గాంధీ ఆశయాలు కాలానికి అతీతంగా అజరామరం, సంక్లిష్టతల నడుమ కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత ప్రపంచం కూడా గాంధీజీ ఆశయాలను పాటించడం ద్వారా శాంతిని స్థిరత్వాన్ని సొంతం చేసుకోవచ్చుని ఆమె స్పష్టం చేశారు.
గాంధీజీ మనముందుంచిన విలువలు, ఆలోచనలు మొత్తం ప్రపంచానికే నూతన దిశ చూపించాయని ఆమె చెప్పారు. ప్రపంచ యుద్ధాలతో ప్రపంచ ప్రజలు అశాంతిని, విద్వేషాలను, ఆందోళనలను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన ఆశింసా మార్గాన్ని చూపారని ఆమె గుర్తు చేశారు. హింసను నైతిక బలం ద్వారా అహింస ద్వారా ఎదుర్కోవచ్చని నూతన మార్గం చూపిన యోధుడు గాంధీజీ అని ముర్ము కొనియాడారు.
రాష్ట్రపతి సోమవారం గాంధీజీ స్మారక స్థలిలోనే గాంధీ వాటికను కూడా ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ తమ జీవన దశలలో పలు కోణాలలో ఉన్నప్పటి భంగిమలను తెలియచేస్తూ ఇక్కడ వందలాది గాంధీజి విగ్రహాలను నెలకొల్పారు. గాంధీ దర్శన్కు సమీపంలోనే దీనిని ఏర్పాటు చేశారు.
జి 20 సదస్సుకు, వివిధ సందర్భాలలో ఇక్కడికి వచ్చే విదేశీ ప్రముఖులు, పర్యాటకులు గాంధీవాటికను సందర్శించుకుంటారని, ఈ విధంగా స్ఫూర్తి పొందుతారని రాష్ట్రపతి తెలిపారు. ప్రత్యేకించి రేపటి తరానికి ప్రతీకలైన బాలలకు ఈ వాటిక విలువైన స్థలి అవుతుందన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, గాంధీ దర్శన్ ఉపాధ్యక్షులు విజయ్ గోయల్ పాల్గొన్నారు.
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు