ఉదయనిధి స్టాలిన్ పై `సుప్రీం’కు మాజీ జడ్జీల ఫిర్యాదు

సనాతన ధర్మాన్ని  సమూలంగా నిర్మూలించాలని తమిళనాడు డీఎంకే నేత, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. పలు వర్గాలలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఉదయ నిధి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించాలని కోరుతూ పలువురు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. ఉదయనిధి వ్యాఖ్యలు సమాజంలో మతపరమైన విద్వేషాలకు, హింసాత్మక ఘటనలకు కారణమవుతాయని పేర్కొంటూ ఆ వ్యాఖ్యలను `విద్వేష ప్రసంగం’గా పరిగణించాలని వారు సుప్రీంకోర్టు ను కోరారు. 
 
ఉదయ నిధి వ్యాఖ్యలతో భారత్ తో సనాతన ధర్మాన్ని విశ్వసించే వారి మనస్సులు గాయపడ్డాయని తెలిపారు. ఈ లేఖపై ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యస్ యన్ ధింగ్రా, కేంద్ర షిప్పింగ్ శాఖ మాజీ కార్యదర్శి గోపాలకృష్ణ సహా 14 మంది మాజీ న్యాయమూర్తులు, 130 మంది ఉన్నతాధికారులు, 118 మంది సైనిక అధికారులు సంతకం చేశారు.
 
వీరిలో 20 మంది మాజీ రాయబారులు కూడా ఉన్నారు. షాహీన్ అబ్దుల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వీరు ఆ లేఖలో ఉటంకించారు. దేశ లౌకికతను కాపాడడానికి ఉదయనిధి స్టాలిన్ పై చర్యలు తీసుకోవడం అత్యవసరమని వారు స్పష్టం చేశారు.
 
టిటిడి చైర్మన్ ఖండన
 
స్టాలిన్ వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంఘాలతో పాటు పలు రాజకీయాలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ  స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన యానమని భూమన చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందని ధ్వజమెత్తారు. ఇది విమర్శకులకు కూడా మంచిది కాదని కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.