ఆదిత్య ఎల్‌-1 క‌క్ష్య మార్పు విజ‌య‌వంతం

ఇస్రో చేప‌ట్టిన ఆదిత్య మిష‌న్ సూర్యుడి దిశ‌గా దూసుకెళ్తున్న‌ది. ప్ర‌స్తుతం భూమిచుట్టూ తిరుగుతున్న ఆదిత్య ఎల్‌-1 క‌క్ష్య‌ను ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు విజ‌య‌వంతంగా మార్చారు. ఆదివారం ఉద‌యం 11.45 గంట‌ల ప్రాంతంలో తొలిసారిగా ఎర్త్‌బౌండ్ ఫైరింగ్‌తో క‌క్ష్య‌ను మార్చిన‌ట్లు చెప్పింది. ప్ర‌స్తుతం ఆదిత్య ఎల్‌-1 భూమికి 22,459 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని పేర్కొంది. 

అయితే, ఈ నెల 5న మ‌రోసారి క‌క్ష్య‌ను మార్చ‌నున్న‌ట్లు ఇస్రో పేర్కొంది. ఇదిలా ఉండ‌గా ఇస్రో పీఎస్ఎల్ వీ సీ-57 వాహ‌కనౌక ద్వారా ఆదిత్య ఎల్‌-1ను ఇస్రో విజ‌య‌వంతంగా నింగిలోకి పంపింది. గ‌తంలో చేప‌ట్టిన చంద్ర‌యాన్‌-3 త‌ర‌హాలోనే ప్ర‌యోగం సాగ‌నున్న‌ది. ఆదిత్య ఎల్‌-1 భూమి చుట్టూ తిరుగుతూ క‌క్ష్య‌ను పెంచుకుంటూ సూర్యుడి దిశ‌గా దూసుకెళ్ల‌నున్న‌ది. 

ఈ ఉప‌గ్ర‌హం భూమి క‌క్ష్య‌లోనే 16 రోజుల పాటు ఉండ‌నున్న‌ది. ఐదుసార్లు కక్ష్య‌ను మార్చుకొని లాగ్రాంజియ‌న్‌-1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఇక్క‌డి నుంచే ఆదిత్య ఎల్‌-1 సూర్యుడిపై అధ్య‌య‌నం చేయ‌నున్న‌ది. ఈ లాగ్రాంజియన్ పాయింట్ భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. 

ఆదిత్య ఎల్‌-1లో ఇస్రో ఏడు పేలోడ్స్‌ను పంపింది. ఇవి సూర్యుడిపై వివ‌రంగా అధ్య‌య‌నం చేయ‌నున్నారు. నాలుగు పేలోడ్స్ సూర్య‌ర‌శ్మిపై, మిగ‌తా మూడు ప్లాస్మా, అయ‌స్కాంత క్షేత్రంపై అధ్య‌య‌నం చేయ‌నున్నారు. ఇస్రో పంపిన శాటిలైట్ ఎ-1 పాయింట్ హాలో ఆర్బిట్‌లో తిరుగుతుంది.