రాజస్థాన్ సిఎం గెహ్లాట్‌కు హైకోర్టు షోకాజ్ నోటీస్‌లు

న్యాయవ్యవస్థపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం సీఎం గెహ్లాట్‌కు రాజస్థాన్ హైకోర్టు శనివారం షోకాజ్ నోటీస్‌లు జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో గెహ్లాట్‌పై సుమోటోగా క్రిమినల్ ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక న్యాయవాది శివచరణ్ గుప్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు. 

దీనిపై జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ అశుతోష్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ చేపట్టి నోటీస్‌లు జారీ చేసింది. మూడు వారాల్లోగా జవాబు ఇవ్వాలని సీఎం గెహ్లాట్‌ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. ఇటీవల జైపూర్‌లో మీడియాతో మాట్లాడిన గెహ్లాట్ న్యాయవ్యవస్థలో అవినీతి పెచ్చరిల్లిపోయిందని ఆరోపించారు.

కొందరు న్యాయవాదులు తీర్పును స్వయంగా రాస్తున్నారని, అదే తీర్పును న్యాయమూర్తులు వివరిస్తున్నట్లు తాను విన్నానని పేర్కొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాను చెప్పింది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని వివరణ ఇచ్చారు. తానెప్పుడూ న్యాయవ్యవస్థను గౌరవిస్తానని, నమ్ముతానని తెలిపారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా, శుక్రవారం జోధ్‌పూర్ లోని హైకోర్టు, దిగువ కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు.