ఛత్తీస్‌గఢ్‌ కు `డిల్లీకా దర్బార్‌’ ఏమీ మేలు చేయదు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడుతూ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి డిల్లీకా దర్బార్‌ (గాంధీ కుటుంబం) ఏమీ మేలు చేయదని ధ్వజమెత్తారు. ఈ ఏడాది చివరలో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. 

ఈ దిశగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా..కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఆరోప్‌ పాత్ర (అభియోగాల జాబితా)ను శనివారం రారుపూర్‌లో ఆవిష్కరించారు. ఈ ఆరోప్‌ పాత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కేవలం పాలన మార్పు గురించి మాత్రమే కాదు. ఛత్తీస్‌గఢ్‌ భవిష్యత్తు గురించి కూడా అని చెప్పారు.

 రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘేల్‌ అవినీతి ప్రభుత్వానికి ఓటు వేయాలా? లేక అభివృద్ధి ఆధారిత బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయాలా? నిర్ణయించుకోవాలని కేంద్ర మంత్రి కోరారు.  ఈ ప్రభుత్వం కుంభకోణాలు, దోపిడీ, ప్రజలపై అత్యాచారాలతో మునిగిపోయిందని ధ్వజమెత్తారు.  `ఛత్తీస్‌గఢ్‌కి దిల్లీకా దర్బార్‌ (గాంధీ కుటుంబం) మేలు చేయదు. రాష్ట్రాన్ని అవినీతి బారి నుంచి కాపాడేది బిజెపి మాత్రమే’ అని స్పష్టం చేశారు. 

బిజెపి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్తామని చెబుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘ఆరోప్‌ పత్ర’ను ఆవిష్కరించాం అని అమిత్ షా తెలిపారు. భూపేష్ భగేల్  ప్రభుత్వం అవినీతిలో అన్ని రికార్డులను అధిగమించి `గాంధీ కుటుంభపు ఏటీఎం’గా మారిందని ఆరోపించారు.

వోట్ బ్యాంకు రాజకీయాలకు పాలపడుతూ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో మతమార్పిడులను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టడి చేయడం లేదని కేంద్ర మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన అక్రమ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ `మహాదేవ్’ కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ రాష్త్ర యువత ఇటువంటి అక్రమ బెట్టింగ్ లో కూరుకు పోవాలా? లేదా బిజెపి ప్రభుత్వంలో వారి అభివృధ్ధికోసం కృషి జరగాగా? నిర్ణయించుకోవాలని అమిత్ షా కోరారు.

2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రజలను దోచుకోవడం తప్ప మరేమీ చేయలేదు అని షా మండిపడ్డారు. రాష్ట్రంలో గత బిజెపి ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా ఆయన కొనియాడుతూ రమణ్‌సింగ్‌ (ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి) పాలనలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి సాధించిందని తెలిపారు. 

రమణ్‌సింగ్‌ ప్రతి ఒక్కరికీ ఉచిత రేషన్‌ అందించాడు. అందుకే ప్రజలు ఆయనను చావల్‌ బాబా (బియ్యాన్ని ఉచితంగా అందించే నాయకుడు)గా పిలుస్తారని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల సమయంలో తాము మహిళా అభ్యర్థిలుకు 50 శాతం సీట్లు కూడా రిజర్వ్‌ చేశామని, ఛత్తీస్‌గఢ్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌, పవర్‌హబ్‌, సిమెంట్‌ హబ్‌, అల్యూమినియం హబ్‌గా గుర్తించేటట్లు చేశామని వివరించారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోందని అమిత్ షా ఆరోపించారు. బిజెపి కార్యకర్తలను హత్యచేసిందని పేర్కొంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల వ్యాపార కేంద్రంగా మార్చిందని షా విమర్శించారు. వేల కోట్ల కుంభకోణాలతో కూడుకున్న బొగ్గు కుంభకోణం, ఆన్ లైన్ బెట్టింగ్ కుంభకోణాలను కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరుపుతున్నామని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ కుంభకోణాలు, అత్యాచారాలు, అక్రమ పాలన నుండి రాష్ట్రాన్ని బిజెపి మాత్రమే కాపాడగలదని చెబుతూ వచ్చే ఎన్నికలలో పూర్తి మెజారిటీతో తిరిగి బిజెపి ప్రభుత్వం ఏర్పడగలదని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు.