పన్నీర్‌సెల్వంపై మళ్లీ ఆదాయానికి మించిన కేసు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఎఐఎడిఎంకె నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వంకు , ఆయన బంధువుకు నోటీస్‌లు జారీ చేయాలని మద్రాస్ హైకోర్టు గురువారం ఆదేశించింది. 2012లో ఈ కేసును ట్రయల్ కోర్టు విచారించగా, ఇప్పుడు హైకోర్టు ఆ కేసును తిరిగి విచారణకు స్వయంగా స్వీకరించింది. 

ఈ కేసులో రాజకీయ పలుకుబడి ఉపయోగించి ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అండ్ యాంటీ కరప్షన్(డివిఎసి), రాష్ట్ర ప్రభుత్వాన్ని, కోర్టును పెడతోవ పట్టించి పన్నీర్‌సెల్వంకు అనుకూలంగా వ్యవహరించారని జడ్జి పేర్కొన్నారు. జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ తన అధికారాలను ఉపయోగించి స్వయంగా ఈ కేసును తిరిగి విచారణకు స్వీకరించారు. 

పన్నీర్‌సెల్వం, ఆయన భార్య విజయలక్ష్మి(దివంగతురాలు), కుమారుడు రవీంద్రనాథ్ కుమార్, ఆయన సోదరులు ఒ రాజా, ఒ బాలమురుగన్, వారి భార్యలు సెప్టెంబర్ 27న కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోజు హాజరు కావాలని ఆదేశించింది.