చావనైనా చస్తాగాని పార్టీ మారను

 
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో బిజెపి నుండి గెలుపొందిన ఏకైక ఎమ్యెల్యే, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తిరిగి వచ్చే ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేయడంపై సందిగ్ధత నెలకొంది.  మునవర్ ఫారుఖీ హైదరాబాద్ లో పర్యటనను వ్యతిరేకించిన రాజా సింగ్.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ అధిష్ఠానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఈ వివాదాస్పద కేసులో రాజా సింగ్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇప్పటి వరకు సస్పెన్షన్ ను ఉపసంహరించక పోవడంతో మరొకరిని బీజేపీ అభ్యర్థిగా పోటీలో దింపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  దీనిని ఆసరాగా చేసుకొని ఆయన తమ పార్టీలోకి వస్తే సీట్ ఇచ్చేందుకు ఇతర పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.
అయితే, తాను పోటీ చేస్తే బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, స్వతంత్ర అభ్యర్థిగా గాని లేదా మరో పార్టీ అభ్యర్థిగా గాని పోటీ చేయబోనని ఆయన ఇదివరకే స్పష్టత ఇచ్చారు.  చాను చావనైనా చస్తాగాని బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీచేసే ప్రసక్తి లేదంటూ మరోమారు ఆయన తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో  బీజేపీ నుంచి తప్పితే ఇతర పార్టీల నుంచి పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ `సెక్యూలర్’ పార్టీలలో  చేరే ప్రసక్తే లేదని రాజా సింగ్ వెల్లడించారు. 
 
” నేను చచ్చినా `సెక్యూలర్’ పార్టీల్లోకి వెళ్లను. నా ప్రాణం పోతున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి పోను. తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం. బీజేపీ నుంచి టికెట్ రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా. కానీ ఇతర పార్టీల్లో వెళ్లను. హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటూ ముందుకెళ్తా. బీజేపీ నా విషయంలో అనుకూలంగా ఉంది. నాపై సస్పెన్షన్ ఎత్తివేస్తారని నమ్మకం ఉంది” అని రాజా సింగ్ ప్రకటించారు.

 
కాగా, గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఎంఐఎం చేతిలో ఉందని ఆరోపించారు. అందుకే ఆ స్థానంలో తమ అభ్యర్థిని ప్రకటించకుండా కేసీఆర్ పెండింగ్ లో పెట్టారని చెప్పారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని రాజా సింగ్ ఎద్దేవా చేశారు.