సెప్టెంబర్‌లోనూ వర్షాలు అంతంతమాత్రమే

ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదని, ఇప్పటికే ఆగస్టు నెలంతా వాతావరణం పొడిగానే ఉందంటూ వాతావరణ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  వాస్తవానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి.
దీంతో దేశంలో ఈ ఏడాది జూన్‌లో లోటు వర్షాపాతం ఏర్పడింది. ఆ తర్వాత రుతుపవనాలు చురుగ్గా మారడంతో దేశవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదైంది. జులైలో 489.9 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు కాగా లోటు తీరినట్లయ్యింది. సాధారణ సగటు కంటే జూన్‌లో తొమ్మిది శాతం తక్కువ లోటు ఉండగా, జులైలో 13 శాతం ఎక్కువగా నమోదైంది.
మరో వైపు సెప్టెంబర్‌ 17 నుంచి రుతుపవనాలు వెనక్కి మళ్లనున్నారు. రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యం కారణంగా గత నాలుగేళ్లుగా సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదవుతున్నప్పటికీ తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. 

వార్షిక సగటు వర్షాపాతంలో 70 శాతం రుతుపవనాల సమయంలోనే నమోదు అవుతుండడం గమనార్హం. వర్షపాతం తగ్గితే నిత్యావసర చక్కెర, పప్పులు, కూరగాయల ధరలు పెరిగే అవకాశం పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో 1972 తర్వాత ఆగస్టులో తెలంగాణలో అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. ఆగస్టులో కేవలం 74.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు కాగా, ఇది సాధారణం కంటే 60 శాతం తక్కువ. 1960 నుంచి రాష్ట్రంలో ఇంత తక్కువగా వర్షపాతం నమోదవడం ఇది మూడోసారి. 1960లో 67.9 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదవగా, 1968లో 42.7 మిల్లీమీటర్లు, 1972లో 83.2 మిల్లీమీటర్లు, ప్రస్తుతం ఆగస్టులో 74.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. 

సాధారణంగా తెలంగాణలో 120 రోజులు వర్షాకాలం ఉంటుందని, 60-70 రోజులు మంచి వర్షాలు కురుస్తాయని.. మిగతా రోజుల్లో అడపదడపా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో జూన్‌లో లోటు ఏర్పడిందని, జులైలో మంచి వర్షాలు కురిసినా ఆగస్టులో వరుణుడు ముఖం చేశాడు. లోటు వర్షపాతానికి ఎల్‌ నినో ప్రధాన కారణమని నిపుణులు వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.