చంద్రయాన్ 3 యావద్భారతం గర్వించే క్షణం

చంద్రయాన్ 3 యావద్భారతం గర్వించే క్షణం
చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజవంతంగా ల్యాండ్ అవడం యావద్భారతం గర్వించే క్షణమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో  చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన  తొలి దేశంగా నిలిచిందని తెలిపారు.

బుధవారం చంద్రయాన్-3 ల్యాండ్ అయిన అద్వితీయమైన ఘట్టాలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులతో కలిసి పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌పై కిషన్ రెడ్డి వీక్షించారు. విక్రమ్ సక్సెస్‌ఫుల్ గా ల్యాండ్ అయిన సందర్భంలో కిషన్ రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం అందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  సందేశాన్ని వీక్షించారు.

అనంతరం పార్టీ కార్యాలయంలో నాయకులు త్రివర్ణపతాకాలు చేతబూని భారత్ మాతాకీ జై, జై జవాన్ ‑ జై కిసాన్ – జై విజ్ఞాన్ నినాదాలు చేశారు. టపాసులు కార్చారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ‘ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా భారత్ కొత్త చరిత్రను లిఖించింది. ఈ సందర్భంగా ఇస్రో, చంద్రయాన్ టీమ్ ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను’ అని తెలిపారు. 

 
ఇస్రో శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష ప్రయోగాలను మరింత ముందుకు తీసుకెళ్లారని, ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేశారని కొనియాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగిరేస్తోందని పేర్కొన్నారు. చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ప్రధాని మోదీకి, 140 కోట్ల మంది భారతీయులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.

ఇటీవలే రష్యా కూడా చంద్రుడి దక్షిణ ధృవంపై దిగేందుకు విఫలయత్నం చేయడం, వివిధ దేశాలు కూడా ఈ దిశగా ప్రయత్నించి విఫలమయిన సందర్భాల్లో భారత్ సాధించిన ఈ విజయం యావత్ ప్రపంచానికి చంద్రునిపై చేయబోయే ప్రయోగాల్లో ఓ దిక్సూచిగా ఉంటాయని ఆయన చెప్పారు. చంద్రయాన్ విజయం అంతర్జాతీయ ప్రయోగాల చరిత్రలో ఓ ప్రధానమైన మలుపు అని కిషన్ రెడ్డి అభివర్ణించారు.