భారత్ లో అమెరికా అధ్యక్షుడి పర్యటన

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సెప్టెంబర్‌ 7 నుండి 10 వరకు భారత్‌లో పర్యటించనున్నారు.  20 దేశాల మధ్య జరిగే ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బైడెన్‌ సెప్టెంబర్‌ 7 నుంచి 10వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో జరగనున్న జి-20 సదస్సులో ఉక్రెయిన్‌ యుద్ధం సహా పలు అంతర్జాతీయ సమస్యలపై ప్రపంచ నేతలతో చర్చ జరపనున్నట్లు వైట్‌ హౌస్‌ మంగళవారం ప్రకటించింది. 

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నికైన తర్వాత భారత్‌కి రావడం ఇదే మొదటిసారి. జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్‌ 9, 10 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ నేతల అతిపెద్ద సమావేశాలలో ఒకటిగా భావిస్తున్నారు.  డిసెంబర్‌ 1, 2022న ఇండోనేషియా నుండి జి-20 ప్రెసిడెన్సీని భారతదేశం స్వీకరించింది. 

అధ్యక్షుడు  బైడెన్‌, జి-20 భాగస్వాములు  స్వచ్ఛమైన ఇంధన పరివర్తన, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ఉక్రెయిన్‌ యుద్ధం యొక్క ఆర్థిక మరియు సామాజిక ప్రభావాలను తగ్గించడం వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి అనేక ఉమ్మడి ప్రయత్నాలను చర్చిస్తారని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరీన్‌ జీన్‌-పియర్రే తెలిపారు. 

ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంతోపాటు పేదరికంపై మెరుగ్గా పోరాడేందుకు ప్రపంచ బ్యాంకుతో సహా బహుపాక్షిక అభివృద్ధి  బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడంపై చర్చించనున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అభినందించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలను కూడా జరుపుతారని తెలిపారు. 2026లో హౌస్ట్‌ చేయడంతో సహా ఆర్థిక సహకారానికి ప్రధాన వేదికగా జి-20 నిబద్ధతను పునరుద్ఘాటిస్తారని ఆ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, జీ20 సమ్మిట్‌ నేపథ్యంలో సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే ప్రతిపాదనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆమోదం తెలిపారు. ఆ తేదీల్లో ఢిల్లీలోని అన్ని కార్యాలయాలు, విద్యా సంస్థలను మూసివేయనున్నారు.