నూహ్ మతఘర్షణల నిందితుడు ఎన్‌కౌంటర్‌ లో అరెస్ట్‌

హర్యానా రాష్ట్రం నూహ్ జిల్లాలో చెలరేగిన మతఘర్షణల్లో ఓ నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని తౌరు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌ లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తన కోసం గాలిస్తున్న పోలీసులను చూసిన నిందితుడు కాల్పులు జరపడంతో ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.
ఈ క్రమంలో అతడి కాలిపై కాల్చడంతో కదల్లేక కుప్పకూలాడు. ఆ వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని వాసింగా గుర్తించారు. అతడిపై రూ. 25 వేల రివార్డు ఉందని, హత్య, లూటీ సహా పలు కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాసింను తౌరులోని అరావల్లిలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
నిందితుడి కాలికి బుల్లెట్ గాయం కావడంతో నల్‌హాద్ మెడికల్ ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. అతడి నుంచి దేశీయ తుపాకి, ఐదు కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా, నూహ్ లో వారం రోజుల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం. జులై 31వ విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు ఓ గుంపు ప్రయత్నించడంతో నుహ్‌లో అల్లర్లు రేకెత్తాయి. 

అల్లరి మూకలు ఓ హోటల్‌ను అడ్డాగా చేసుకుని రాళ్లు రువ్వినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆ హోటల్‌ను పోలీసులు కూల్చివేశారు. ఈ ఘర్షణలు క్రమంగా పొరుగున ఉన్న గురుగ్రామ్‌కు కూడా పాకాయి. గుర్‌గ్రామ్‌లోని బాద్‌షాపూర్‌లో ఓ రెస్టారెంట్‌తో పాటు 14 దుకాణాలను ధ్వంసం చేశారు. సెక్టార్‌ 66 పరిధిలో ఏడు దుకాణాలకు నిప్పుపెట్టారు.

బైక్‌లు, కార్లలో వచ్చిన దాదాపు 200 మందితో కూడిన గుంపు ప్రధానంగా బిర్యానీ అమ్మే దుకాణాలు, ఇతర ఫుడ్‌స్టాళ్లపై దాడులు చేశారు. ఈ అల్లర్లలో ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 100 మందిని అరెస్ట్‌ చేశారు.