లష్కరే టాప్‌ కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. నిర్ధిష్ట సమాచారం మేరకు పుల్వామాలోని లారో-పరిగం ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి స్థానిక పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్‌  సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. 
 
ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యం కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయినట్లు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. వారిలో ఒకరిని లష్కరే తొయీబా కమాండర్‌గా అనుమానిస్తున్నామని చెప్పారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని, మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు వెల్లడించారు.
 
 రెండు వారాల క్రితం రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యారు. ఆగస్టు 5న రాష్ట్రీయ రైఫిల్స్‌, కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. కాగా, తాజా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.