75 మంది రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు

మొత్తం 225 రాజ్యసభ సిట్టింగ్ సభ్యులలో 75 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించుకోగా మహిళలపై నేరాలకు సంబంధించి నలుగురు ఎంపీలపై కేసులు ఉన్నట్లు శుక్రవారం ఒక తాజా నివేదిక వెల్లడించింది. మొత్తం 233 రాజ్యసభ ఎంపీలలో 225 ఎంపీల నేర చరిత్రకు సంబంధించిన వివరాలను అధ్యయనం చేసినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్), నేషనల్ ఎలెక్షన్ వాచ్(ఎన్‌ఇడబ్లు) తమ నివేదికలో తెలిపాయి.

ప్రస్తుత రాజ్యసభలో ఒక సీటు ఖాళీ ఉండగా అఫిడవిట్లు అందుబాటులో లేనికారణంగా ముగ్గురు ఎంపీలపై అధ్యయనం జరపనట్లు నివేదిక పేర్కొంది. జమ్మూ కశ్మీరులోని నాలుగు సీట్లపై కూడా స్పష్టత లేదని తెలిపింది. 225 సిట్టింగ్ ఎంపీలలో 75 మంది అంటే 33 శాతం మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్వయంగా అఫిడవిట్లలో పేర్కొన్నారని నివేదిక తెలిపింది.

వీరిలో 41 మంది తమపై సీరియస్ క్రమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించగా, ఇద్దరు ఎంపీలు తమపై హత్యకు సంబంధించిన కేసులు(సెక్షన్ 302) ఉన్నట్లు ప్రకటించారని నివేదికలో పేర్కొన్నారు.  మహిళలపై నేరాలకు సంబంధించి నలుగురు ఎంపీలు తమపై కేసులు ఉన్నట్లు తెలిపారని నివేదిక పేర్కొంది. ఈ నలుగురు ఎంపీలలో రాజస్థాన్ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు కెసి వేణుగోపాల్ తనపై అత్యాచారానికి సంబంధించిన కేసు(సెక్షన్ 373) ఉన్నట్లు ప్రకటించారని నివేదిక తెలిపింది.

నలుగురు ఎంపీలు తమపై హత్యాయత్నం కేసులు(సెక్షన్ 307) ఉన్నట్లు ప్రకటించారని తెలిపింది. బిజెపికి చెందిన మొత్తం 85 మంది రాజ్యసభ సభ్యులలో 23 మంది, కాంగ్రెస్‌కు చెందిన మొత్తం 30 మంది ఎంపీలలో 12 మంది, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మొత్తం 13 మందిలో నలుగురు ఉన్నారు. 

కాగా, ఆర్‌జెడికి చెందిన మొత్తం ఆరుగురిలో ఐదుగురు, సిపిఎంకు చెందిన మొత్తం ఐదుగురిలో నలుగురు, ఆప్‌కు చెందిన మొత్తం 10 మందిలో ముగ్గురు, వైఎస్‌ఆర్‌సిపికి చెందిన మొత్తం 9 మందిలో ముగ్గురు, ఎన్‌సిపికి చెందిన మొత్తం ముగ్గురిలో ఇద్దరు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్లలో పేర్కొన్నారని నివేదికలో తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఎంపీలపైన అత్యధిక క్రిమినల్ కేసులు ఉండగా తరువాత స్థానాలలో బీహార్, ఉత్తర ప్రదేశ్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

12 శాతం మంది బిలియనీర్లు

 కాగా, ఇదే నివేదిక ప్రకారం రాజ్యసభలో బిలియనీర్లు 12 శాతం మంది ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలే అగ్రస్థానంలో ఉన్నారు. 233 స్థానాలున్న రాజ్యసభలో 225 ఎంపీలుండగా, రూ.100 కోట్లకు పైగా ఆదాయం ఉన్నట్టు ప్రకటించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది పార్లమెంటేరియన్లలో ఐదుగురు (45 శాతం), తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల్లో ముగ్గురు ఉన్నారు.

రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నట్టు ప్రకటించిన ఎంపీల్లో మహారాష్ట్రలోని 19 మంది ఎంపీల్లో ముగ్గురు (16 శాతం) ఉన్నారు. ఢిల్లీ నుంచి ముగ్గురు ఎంపీల్లో ఒకరు (33 శాతం), పంజాబ్‌ నుంచి ఏడుగురు ఎంపీల్లో ఇద్దరు (29 శాతం), హర్యానా నుంచి ఐదుగురు ఎంపీల్లో ఒక్కరు (20 శాతం), మధ్యప్రదేశ్ నుంచి 11 మంది ఎంపీల్లో ఇద్దరు (18 శాతం) ఉన్నారు.

నివేదక ప్రకారం, తెలంగాణకు చెందిన మొత్తం ఏడుగురు బిలియనీర్ల మొత్తం ఆస్తి రూ.5,596 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది ఎంపీల ఆస్తుల మొత్తం రూ.3,823 కోట్లు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 మంది ఎంపీలు రూ.1,941 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు.