ప్రతి నగరంలో తిరంగా ర్యాలీ

ఆగస్టు 15న దేశవ్యాప్తంగా నివాసాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలతో పాటు అన్ని ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగరేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో ఢిల్లీలో శుక్రవారం ఉదయం తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. 

ప్రగతి మైదాన్ వద్ద కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలు కూడా తమ తమ ప్రాంతాల్లో జరిగే ఇలాంటి ర్యాలీల్లో స్వచ్ఛందంగా భాగస్వామ్యులై జాతీయ భావనను ప్రదర్శించాలని కోరారు.

అంతకుముందు దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్ జెండా ఊపి తిరంగా ర్యాలీ ప్రారంభించారు. ధన్‌కర్ మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలు, కుల, మత, ప్రాంత అభిప్రాయ భేదాలకన్నా జాతీయ భావనే అత్యుత్తమం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నా దేశం అని భావించినపుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

 ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకున్నప్పుడే మన స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలను చేరుకోగలమని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, మీనాక్షి లేఖితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు,యువమోర్చా కార్యకర్తలు, వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు.