అమెరికాను వణికిస్తున్న భీకర తుఫాను

అమెరికాను భీకర తుపాను అతలాకుతలం చేస్తోంది. భీకర గాలులు, ఉరుములతో కూడిన వర్షం, వడగళ్లతో అగ్రరాజ్యం వణికిపోతోంది. ముఖ్యంగా ఈ తుపాను ధాటికి ఉత్తర అమెరికా అతలాకుతలమైంది.  ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి.  పలు రాష్ట్రాల్లో పవర్‌ కట్‌ అయ్యింది. దీంతో లక్షల మంది ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు.
 
తూర్పు అమెరికాలో భీకర గాలులు, ఉరుములతో కూడిన వర్షం , వడగళ్ళు విరుచుకుపడుతున్నాయి. టెనసీ నుంచి న్యూయార్క్ వరకు 10 రాష్ట్రాల్లో కల్లోల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.  దాదాపు మూడు కోట్ల మంది టోర్నడోల ముప్పు ఎదుర్కొన్నారని జాతీయ వాతావరణ సేవల విభాగం తెలిపింది. ‘అత్యంత బలమైన గాలులతో తుఫాన్లు, టోర్నడోలు విరుచుకుపడే ప్రమాదముంది. ప్రజలు ఇంటి వద్దే ఉండాలి. బయటకు రావొద్దు’ అని హెచ్చరికలు జారీ చేసింది. చెట్ల మీద పడిన పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. 
 
11 లక్షల ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్ సదుపాయం లేకుండా పోయింది. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇతర సేవలను ముందుగానే మూసేశారు. తీర ప్రాంత వరద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, అట్లాంటా, బాల్టిమోర్‌ల లోని విమానాశ్రయాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. 
 
ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ “ ఫ్లైట్ అవేర్ ” ప్రకారం సోమవారం రాత్రి నాటికి 2600 కు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 7900 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మేరీల్యాండ్ , అలబామా, జార్జియా, ఉత్తర దక్షిణ కరోలినాలు , న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, వర్జీనియా తదితర ప్రాంతాల్లో 11 లక్షల ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్ సరఫరా నిలిచి పోయినట్టు సమాచారం.