కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చిన అసెంబ్లీ

కేరళ అసెంబ్లీ బుధవారం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రం పేరును ‘కేరళ’ నుంచి ‘కేరళం’గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ఈ తీర్మానాన్ని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర అధికారిక పేరును అన్ని భాషల్లో కేరళంగా మార్చాలని, ఈ మేరకు అన్ని అధికారిక లావాదేవీల్లో కేరళం పేరును ఉపయోగించాలని కోరుతూ ఈ తీర్మానాన్ని రూపొందించారు.

కేరళ పేరును ‘కేరళం’ గా మార్చాలన్న అభ్యర్థనకు సంబంధించిన తీర్మానాన్ని కేరళ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభలోని అన్ని పక్షాల నాయకులు ఏకగ్రీవంగా, ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం తెలిపారు. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడ్తూ రాష్ట్రం పేరును మార్చాలని ఎందుకు కోరుతున్నామో సీఎం విజయన్ సభకు వివరించారు. 

‘‘మళయాళంలో మన రాష్ట్రం పేరు కేరళం. భాషాప్రాతిపదికన 1956 నవంబర్ 1న రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో కేరళను కూడా ఏర్పాటు చేశారు. నాటి నుంచి అదే పేరు కొనసాగుతోంది. బ్రిటిష్ పాలన కాలం నుంచి కూడా మళయాళం మాట్లాడే ప్రజలు ఉన్న ప్రాంతాన్ని కేరళంగా పేర్కొంటూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది” అని గుర్తు చేశారు.

 స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగం లోని మొదటి షెడ్యూల్ లో మన రాష్ట్రం పేరును కేరళ అని రికార్డు చేశారని, అందువల్ల, రాష్ట్రం పేరును, అన్ని అధికారిక భాషల్లో కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరతూ, అందుకు అవసరమైన అన్ని రాజ్యాంగ సవరణలు చేయాలని అభ్యర్థిస్తున్నామని విజయన్ వివరించారు.