పండుగలలో స్వదేశీని మంత్రంగా పాటించాలి

ప్రస్తుత పండుగల పర్వదినాలలో మనమంతా స్వదేశీని మంత్రంగా పాటించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. దేశీయ ఉత్పత్తులను ఆదరించాలని, ఖాదీనే ధరించాలని, ఇక్కడ ఉత్పత్తి అయిన పలు రకాల సరుకులను వాడకాల ద్వారా ప్రోత్సహించాలని కోరారు. 

జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో ప్రగతిమైదాన్‌లోని భారత్ మండపంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ  స్వదేశీకి ఇది నిజంగానే ముఖ్యమైన పండుగ అవుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 9వ తేదీన అప్పట్లో మహాత్మా గాంధీ పిలుపుతో క్విట్ ఇండియా ఉద్యమం వెల్లువెత్తిందని గుర్తు చేశారు.

ఇప్పుడు దేశంలో పండుగల కాలం ఆరంభం అవుతోందని పేర్కొంటూ ముందు సోదరసోదరీ బంధంతో రక్షాబంధన్, తర్వాత అవిఘ్నమస్తుగా గణేష్ చతుర్థి, తరువాత విజయాల దసరా ఉత్సవాలు, ఆ తర్వాత చెడుపై మంచి గెలుపు వేడుకల దీపావళి ఈ విధంగా పలు పండుగలు వస్తున్నాయని ప్రధాని గుర్తు చేశారు.

భారతదేశానికి చేనేత, ఖాదీ, జవుళి రంగాలు అత్యంత కీలకమైనవని చెబుతూ ప్రత్యేకించి టెక్స్‌టైల్స్ రంగంలో భారత్ ప్రపంచ నాయక పాత్రలో ఉందని పేర్కొన్నారు. త్వరలోనే భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక మహాశక్తిగా రూపొందించాలనేదే తమ లక్షం అని, ఈ ప్రక్రియలో జవుళి రంగం, ఫ్యాషన్ పరిశ్రమకు విశేష స్థానం ఉందని తెలిపారు. 

ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నియో మిడిల్ క్లాసుతో జవళి రంగానికి పలు నూతన అవకాశాలు వచ్చివాలాయని వివరించారు. స్వదేశీ ఇప్పుడు నయా విప్లవం అయిందని తెలిపారు.  అవినీతి బంధుప్రీతిల కాలం చెల్లిందని, ఈ రెండూ ఇక క్విట్ ఇండియానే అని సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ క్విట్ ఇండియా ఉద్యమం ఈ నెలలోనే ఈ రోజుల్లోనే అప్పట్లో నినాదమై తర్వాత ఉద్యమమై దేశ స్వాతంత్య్రానికి దారితీసిందని గుర్తు చేశారు. 

ఇప్పుడు ఈ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోనే తిరిగి ఓసారి తాము ప్రజల మందుకు అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపురాజకీయాల పార్టీలపై క్విట్‌ఇండియాకు పిలుపు వెలువరిస్తున్నట్లు తెలిపారు. ఈ దేశం భారత్, ఇది భారతదేశం అని పేర్కొన్న ప్రధాని ఇండియా కూటమి ఇప్పుడు దేశానికి పెను ముప్పుగా దాపురించిందని హెచ్చరించారు.