డిజిటల్‌ డాటా ప్రొటెక్షన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరో కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దేశ పౌరుల డేటా దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కఠిన చర్యలకు వీలు కల్పించే ఈ బిల్లుకు లోక్ సభలో మెజారిటీ సభ్యుల మద్దతు లభించింది. ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2023 ద్వారా దేశ పౌరుల డిజిటల్ హక్కులు బలోపేతం అవుతాయని కేంద్రం చెబుతోంది. 

ముఖ్యంగా, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం చేసే కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు వీలవుతుందన్నది ప్రభుత్వ వాదన. ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం గతవారమే లోక్ సభలో ప్రవేశపెట్టింది. దీనిపై నేడు చర్చ చేపట్టారు.  సభ్యుల మూజువాణి ఓటుతో బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

అయితే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఓవైపు విపక్షాల నిరసనలు కొనసాగుతుండగానే మూజువాణి పద్దతిలో ఓటింగ్ నిర్వహించి బిల్లును కేంద్రం ఆమోదింపజేసుకుంది. గత గురువారం నాడు ఈ బిల్లును కేంద్ర కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు దేశ పౌరుల డాటాను ఎలా వినియోగించుకోవాలి, ఎలా వినియోగించకూడదు..? అనే వివరాలను ఈ బిల్లులో పొందుపర్చారు. లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇక రాజ్యసభ ఆమోదం కూడా పొందితే చట్ట రూపం దాలుస్తుంది. కాబట్టి ఆమోదం కోసం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

అయితే, వ్యక్తిగత సమాచార గోప్యత ప్రాథమిక హక్కుకు ఈ బిల్లు తూట్లు పొడుస్తుందని విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ బిల్లును మొదట స్టాండింగ్ కమిటీ ముందుకు పంపాలని డిమాండ్ చేశాయి. గతేడాది కూడా ఇలాంటిదే బిల్లు తీసుకువచ్చే ప్రయత్నం చేసి, ప్రభుత్వం ఉపసంహరించుకుందని విపక్షాలు గుర్తు చేశాయి. కానీ, ఈసారి మాత్రం కేంద్రం పట్టుబట్టి మరీ బిల్లును ఆమోదింపజేసుకుంది.