చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే సమస్యలు పరిష్కారం

చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలనేది భారత్ విధానమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ స్పష్టం చేశారు. శాంతిని నెలకొల్పేందుకు ఇదే సరైన మార్గంగా భారత్ విశ్వసిస్తోందని చెప్పారు. ఉక్రెయిన్ అంశంపై వివిధ దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సౌదీ అరేబియా లోని జెడ్డాలో జరిగింది. 

సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో 42 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించలేదు. “రష్యాఉక్రెయిన్ మధ్య సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి దానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలతో భారత్ చర్చిస్తోంది. ఈ సమస్యకు శాశ్వత సమగ్ర పరిష్కారం కనుగొనేందుకు క్రమం తప్పకుండా కృషి చేస్తోంది. ఇరు దేశాలు సంక్షోభానికి ముగింపు పలికితే భారత్ హర్షిస్తుంది” అని అజిత్ డోవల్ పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ఆధారంగా నెలకొన్న అంతర్జాతీయ ప్రక్రియకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ ఉంటుందని ఆయన తెలిపారు. ఎటువంటి మినహాయింపు లేకుండా సార్వభౌమత్వం, సరిహద్దుల సమగ్రతలను అన్ని దేశాలు గౌరవించాల్సిందే అని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ కు అన్ని విధాలుగా మానవతా సహాయాన్ని భారత్ అందిస్తుందని ఆయన చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో పరిష్కారం కోసం అన్ని దేశాలు ప్రయత్నం చేయాలని కోరుతూ దీని కారణంగా మొత్తం ప్రపంచం ఎంతో నష్టానికి గురవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్రమైన పరిష్కారం కనుగొనడంతో భారత్ క్రియాశీలకమైన భాగస్వామిగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

 ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటి నుంచి సంక్షోభానికి ముగింపు పలికేందుకు భారత్ తన వంతుగా ఇరు దేశాల అధ్యక్షులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది మొదట్లో జపాన్‌లో జరిగిన జీ 7 దేశాల సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.  సంక్షోభానికి ముగింపు పలికేందుకు భారత్ తన వంతు కృషి చేస్తుందని ఆయనకు మోదీ  తెలిపారు. అంతకు ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పలుమార్లు ప్రధాని మోడీ ఫోన్ సంభాషణలు జరిపారు.