ప్రతిపక్ష పార్టీలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ప్రతిపక్షాలకు హితవు చెప్పారు. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై జరుగుతోన్న చర్చల్లో గురువారం లోక్ సభలోపాల్గొంటూ రానున్న లోక్ సభ ఎన్నికల కోసం పొత్తులు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.
ఎన్ని కూటములు ఏర్పాటైనా, సంపూర్ణ ఆధిక్యతతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మళ్లీ అధికారం చేపడతారని జోస్యం చెప్పారు.
జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సి. రాజగోపాల చారి, రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేద్కర్ వంటి నేతలు కూడా ఢిల్లీకి పూర్తి స్థాయి హోదా ఇవ్వాలన్న ఆలోచనను వ్యతిరేకించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇటీవలే ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ఇండియాను ప్రస్తావిస్తూ ‘‘మీకు ఎన్ని కావాలంటే అన్ని కూటములను ఏర్పాటు చేసుకోండి. మోదీ గారు సంపూర్ణ ఆధిక్యతతో మళ్లీ అధికారంలోకి వస్తారు’’ అని చెప్పారు. ఢిల్లీ గురించి ఆలోచించాలని, కూటముల గురించి కాదని ప్రతిపక్షాలకు సలహా ఇచ్చారు.
“మీ కూటమిలో ఉన్నారన్న ఒక్క కారణం చేత, ఢిల్లీలో జరుగుతోన్న అవినీతికి మద్దతు పలకొద్దని అన్ని పార్టీలను కోరుతున్నాను. ఎందుకంటే ఈ కూటమి ఉన్నప్పటికీ , ప్రధాని మోదీ రాబోయే ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు” అంటూ ఆప్ తో చేతులు కలుపుతున్న ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ఇండియాలో భాగంగా ఉంది. అలాగే ఆప్పై తీవ్ర విమర్శలు చేశారు. “2015 లో ఢిల్లీలో ఆ పార్టీ (ఆప్ ) అధికారంలోకి వచ్చింది. వారి ప్రధాన ఉద్దేశం ఘర్షణ పడటమే. ఇక్కడ బదిలీల అంశం సమస్య కాదు. వారి బంగ్లాల నిర్మాణం వంటి వాటిల్లో జరుగుతున్న అవినీతి దాచేందుకు విజిలెన్స్ విభాగాన్ని నియంత్రిస్తుండటమే అసలు సమస్య” అంటూ ఘాటుగా విమర్శించారు.
2015 ముందు వరకు వివిధ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఢిల్లీ లోని పరిపాలన వ్యవహారాలు సజావుగా సాగాయని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంపై ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
ఈ తీర్పు అనంతరం పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్సును తీసుకొచ్చింది దాని స్థానంలో బిల్లును కేంద్రం ఈ వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో ప్రవేశ పెట్టింది. ‘ఢిల్లీకి సంబంధించి ఏ అంశంపైన అయినా పార్లమెంట్కు చట్టం చేసే అధికారం ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ ఆర్డినెన్స్ వెల్లడిస్తోంది. ఢిల్లీకి సంబంధించి చట్టాలను రూపొందించేందుకు రాజ్యాంగం లోని నిబంధనలు అనుమతిస్తున్నాయి” అని అమిత్షా స్పష్టం చేశారు.
More Stories
రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు
ఓట్ల కోసం నిప్పుతో కాంగ్రెస్ చెలగాటం
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం