వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్ భారత్ కైవ‌సం

వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను భారత్ కైవ‌సం చేసుకున్న‌ది. 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకున్న‌ది. మూడ‌వ వ‌న్డేలో ఇండియా 200 ర‌న్స్ తేడాతో క‌రేబియ‌న్ల‌పై విజయం సాధించింది. రెండో వ‌న్డేలో దారుణంగా ఓట‌మి పాలైన భారత్ మూడ‌వ వ‌న్డేలో చెల‌రేగింది. ఇండియ‌న్ టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు దుమ్మురేపారు. 
 
ఇండియా నిర్ణీత ఓవ‌ర్ల‌లో అయిదు వికెట్ల న‌ష్టానికి 315 ర‌న్స్ చేసింది. భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన విండీస్ కేవ‌లం 151 ర‌న్స్‌కే ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్ 4, ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీసుకున్నారు.  తొలుత టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. ఓపెనర్లు శుభ‌మ‌న్ గిల్(85), ఇషాన్ కిషన్(77)లతోపాటు సంజూ శాంస‌న్(51), హర్దిక్ పాండ్యా(70)లు అర్థ శతకాలతో రాణించారు.
 
క‌రీబియ‌న్ టూర్‌లో మొద‌ట నిరాశ‌ప‌రిచిన శుభ‌మ‌న్ గిల్ మూడ‌వ వ‌న్డేలో అద్భుత‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించారు. 92 బంతుల్లో 85 ర‌న్స్ చేశాడ‌త‌ను. మ‌రో ఓపెన‌ర్ ఇషాన్ కిష‌ణ్‌తో క‌లిసి ఇద్ద‌రూ తొలి వికెట్‌కు 143 ర‌న్స్ జోడించారు. కిష‌ణ్ కూడా జోరుగా బ్యాటింగ్ చేశాడు. అత‌ను 64 బంతుల్లో 77 ర‌న్స్ చేశాడు. 
 
ఓపెన‌ర్లు ఇచ్చిన ఊపును మిడిల్ ఆర్డ‌ర్ కూడా కొన‌సాగించింది.  సంజూ సాంస‌న్ 41 బంతుల్లో 51 ర‌న్స్ చేశాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా భారీ షాట్ల‌తో అల‌రించాడు. పాండ్యా కేవ‌లం 50 బంతుల్లో 70 ర‌న్స్ చేశాడు. దాంట్లో అయిదు సిక్స‌ర్లు, నాలుగు బౌండ‌రీలు ఉన్నాయి. 
 
ఇక భారీ టార్గెట్‌తో చేజింగ్ ప్రారంభించిన విండీస్‌కు ఆరంభంలో ముకేశ్ కుమార్ త‌న పేస్‌తో ఇబ్బందిపెట్టాడు. ప‌వ‌ర్‌ప్లేలో విండీస్ దూకుడును అత‌ను అడ్డుకున్నాడు. ముకేశ్ ఏడు ఓవ‌ర్ల‌లో 30 ర‌న్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. శార్దూల్ నాలుగు, జ‌య‌దేవ్ ఒక‌టి, కుల్దీప్ రెండు వికెట్లు తీసుకున్నారు. విండీస్ బ్యాట‌ర్ల‌లో మోతే(39 నాటౌట్‌), అల్జ‌రీ జోస‌ఫ్‌(26)లు తొమ్మిదో వికెట్‌కు 55 ర‌న్స్ జోడించడం విశేషం.