బ్రిటన్‌లో ఆకర్షణీయంగా వస్త్ర ధారణలో అక్షత మూర్తి

బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ సతీమణి అక్షత మూర్తికు అరుదైన గుర్తింపు లభించింది. ఆమె బ్రిటన్‌లో ఆకర్షణీయంగా వస్త్రాలు ధరించేవారిలో ప్రథమ స్థానంలో నిలిచారని టాట్లర్ మ్యాగజైన్ ప్రకటించింది. ‘లవ్ యాక్చువల్లీ’ స్టార్ బిల్ నిఘీ, ప్రిన్సెస్ బియాట్రిస్ భర్త ఎడోఆర్డో మాపేల్లి మొజ్జి వంటివారి సరసన ఆమెను నిలిపింది.

2023వ సంవత్సరానికి ‘టాట్లర్’ బెస్ట్ డ్రెస్స్‌డ్ జాబితాలో ప్రథమ స్థానం అక్షత మూర్తిదేనని ఈ పత్రిక స్టైల్ ఎడిటర్ చాండ్లర్ ట్రెగస్కెస్ ప్రకటించారు. ఆధునిక కాలంలో అందరి దృష్టినీ ఆకర్షించే విధంగా, ఫ్యాషన్ విషయంలో ఎటువంటి పొదుపు, ఆదాలతో సంబంధం లేకుండా, విలాసవంతంగా అలంకరించుకునే వ్యక్తులకు ప్రకాశవంతమైన ఉదాహరణగా ఆమె నిలిచారని చెప్పారు. 

ఆమె ఫ్యాషన్ సెన్స్ అద్భుతమని చెప్తూ, ఆమెను ఈ విషయంలో జాకీ కెన్నెడీతో పోల్చారు. అక్షత మూర్తి వ్యాపారవేత్త, ఫ్యాషన్ డిజైనర్ కూడా. ఆమె అధికారిక కార్యక్రమాలకు అత్యంత సొగసైన, ఆకర్షణీయమైన వస్త్రాలు, పాదరక్షలు, హ్యాండ్ బ్యాగులు ధరించి హాజరవుతూ ఉంటారు. కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం కార్యక్రమానికి ఆమె మృదువైన నీలి రంగు వస్త్రాలను ధరించి, అందరి దృష్టినీ ఆకర్షించారు. 

ఈ దుస్తులను ప్రముఖ డిజైనర్ క్లెయిర్ మిషెవ్‌స్ని డిజైన్ చేశారు. ట్రూపింగ్ కలర్స్ అనే మరో సందర్భంలో ఆమె వైట్ మిడ్-లెంగ్త్ డ్రెస్ ధరించి, మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని కనిపించారు. ప్రింట్స్, కలర్స్‌తో ఆమె ప్రయోగాలు చేస్తూ ఉంటారు.

అక్షత మూర్తి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు. లాస్ ఏంజెల్స్‌లో ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్‌లో డిప్లమో చేశారు. 2009లో ఆమె ఫైనాన్స్ జాబ్‌ను వదిలిపెట్టారు. ఆ తర్వాత ఆమె ప్రారంభించిన వస్త్ర వ్యాపారం 2017లో మూతపడింది. ఆమెకు బాల్యం నుంచి ఫ్యాషన్ పట్ల మక్కువ ఎక్కువే.