పాక్ లో రాజకీయ ర్యాలీలో పేలుడు .. 35 మంది మృతి

యాదాది దేశం పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో దాదాపు 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్‌ ఫఖ్తున్‌క్వాలోని బజౌర్‌ జిల్లాలో ఆదివారం జరిగిన జమియాత్ ఉలేమా ఎ ఇస్లాం ఫజల్ కార్యకర్తల ర్యాలీలో ఈ పేలుడు జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానిక జియో న్యూస్‌ తెలిపింది. 
 
పేలుడులో 35 మంది మరణించారని, 80 మంది వరకు గాయపడ్డారని పేర్కొంది. క్షతగాత్రులను పెషావర్‌లోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపింది. అయితే, పేలుడులో జేయూఐ ఎఫ్‌ నేత అమీర్‌ జియువల్లా ఖాన్‌ ఉన్నారు. జమియాత్ ఉలేమా ఇ ఇస్లాం పాక్‌లోని దేవబంది సున్నీ రాజకీయ పార్టీ. 

పేలుడు అనంతరం భద్రతా బలగాలు సంఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. ఇప్పటి వరకు పేలుడుకు మాత్రం కారణాలు తెలియరాలేదు. అయితే, జేయూఐ ఎఫ్‌ నేత హఫీజ్‌ హమ్దుల్లా సైతం ర్యాలీకి హాజరుకావాల్సి ఉండగా.. త్రుటిలో తప్పించుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ర్యాలీకి హాజరుకావడం కుదరలేదని స్థానిక మీడియాతో తెలిపారు.

దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది జిహాద్‌ కాదని, ఉగ్రవాదమని ఘటన వెనుకన్న వారికి స్పష్టం చేయాలనుకుంటున్నానని తెలిపారు. పేలుడులో పలువురు జర్నలిస్టులు సైతం గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. పాక్‌లో ఇటీవల కాలంలో బాంబు పేలుళ్లు సాధారణంగా మారాయి.  ఆఫ్ఘనిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకున్న ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడానికి ‘ఆఫ్ఘాని టెర్రర్’ సంస్థలు కారణమని ప్రభుత్వం పేర్కొంది. గత వారం ప్రారంభంలో వాయువ్య పాకిస్థాన్‌లోని ఒక చారిత్రాత్మక మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది.