హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్లు

హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు మధ్య రెండు బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. అయితే, ఇవి అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో 20 ఏళ్లకుపైగా సమయం పట్టనుంది. అనుకున్న గడువు కన్నా ముందే రైళ్లను పట్టాలపైకి ఎక్కించాలని కేంద్రం భావిస్తోంది.  ఇండియన్ రైల్వే ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ రూట్‌లో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు నడిపేందుకు సన్నద్ధమవుతోంది.

హైస్పీడ్ రైల్ లైన్ పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. 2027 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలును పరుగులు పెట్టించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.  భారతీయ రైల్వే మరిన్ని రూట్లల్లో బుల్లెట్ ట్రైన్స్ నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. నేషనల్ రైల్ ప్లాన్‌లో మరిన్ని రూట్స్ ప్రతిపాదనలో ఉన్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభ వేదికగా వెల్లడించారు.

నేషనల్ రైల్ ప్లాన్‌లో ముంబై-హైదరాబాద్ రూట్‌తో పాటు ఢిల్లీ- వారణాసి, ఢిల్లీ- అహ్మదాబాద్, ముంబై- నాగ్‌పూర్, చెన్నై- మైసూర్, వారణాసి- హౌరా రూట్స్ ఉన్నట్టు ఆయన వివరించారు.  ప్రస్తుతం జపాన్ ప్రభుత్వం నుంచి సాంకేతిక సహకారం, ఆర్థిక సహాయంతో ముంబై- అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ చేపట్టినట్టు ప్రకటించారు.

మరోవైపు ఇండియన్ రైల్వే వెబ్‌సైట్‌లోని నేషనల్ రైల్ ప్లాన్‌లో వివరాల ప్రకారం ముంబై- హైదరాబాద్ రూట్‌తో పాటు హైదరాబాద్- బెంగళూర్ రూట్ కూడా ప్రతిపాదనలో ఉంది. 2041 నాటికి హైదరాబాద్-బెంగళూర్ రూట్‌లో 618 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది.

ముంబై- హైదరాబాద్ రూట్‌లో బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ 2051 నాటికి పూర్తవుతుంది. ముంబై, హైదరాబాద్ మధ్య 709 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైల్వే ప్రాజెక్ట్ కవర్ చేస్తుంది. విజన్ 2024లో భాగంగా మొత్తం 251 రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేపట్టింది రైల్వే. ఇందులో 76 కొత్త లైన్లు, 19 గేజ్ కన్వర్షన్లు, 156 డబ్లింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 29 వేల 147 కిలో మీటర్లను కవర్ చేస్తుంది. రూ. 4.92 లక్షల కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టుల్ని నిర్వహిస్తోంది రైల్వే శాఖ.