తిరుపతిలో కూలిన శ్రీనివాస సేతు గడ్డర్.. ఇద్దరు దుర్మరణం

తిరుపతి నుంచి తిరుమల వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు టీటీడీ నిధులతో చేపట్టిన శ్రీనివాస సేతు నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రిలయన్స్‌ మార్టు సమీపంలో రైల్వే వంతెన వద్ద బుధవారం అర్ధరాత్రి 11.45 గంటలకు క్రేన్‌తో గడ్డర్‌ సెగ్మెంట్‌ను తరలిస్తున్నారు. పిల్లర్లపై ప్రికాస్ట్‌ గడ్డర్ సెగ్మెంట్‌లను అమర్చే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదం జరిగింది.

క్రేన్ల ద్వారా కాంక్రీట్ సెగ్మెంట్‌‌ను తరలించి వాటిని గడ్డర్లపై అమర్చే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో కార్మికులు కాంక్రీట్ సెగ్మెంట్‌కు బోల్టులు బిగిస్తుండగా అది జారి కింద పడింది. దీంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన చెందిన అభిజిత్‌ఘోష్‌(20), బిహార్‌కు చెందిన బుద్ధా మందల్‌(44) గడ్డరు సెగ్మెంట్‌ కిందపడి మృతి చెందారు. తిరుపతి ఈస్ట్‌ సీఐ మహేశ్వర్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు.

తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే మార్గంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో నేరుగా తిరుమల వెళ్లేందుకు వీలుగా శ్రీనివాస సేతు పేరుతో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది చివరికల్లా పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని టీటీడీ భావిస్తోంది. తరచూ సమీక్షలు నిర్వహించి పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టు సంస్థపై ఒత్తిడి చేస్తున్నారు. రికార్డు సమయంలోనే నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో రాత్రింబవళ్లు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపడుతున్నారు.

కొద్ది నెలల క్రితం జరిగిన సమీక్షల్లో శ్రీనివాస సేతు నిర్మాణం దాదాపు 90 శాతానికి పైగా పూర్తి కావడంతో మిగిలిన పనులు పూర్తి చేసి ఈ ఏడాది జూన్ నాటికి శ్రీనివాస సేతును ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. గత ఫిబ్రవరిలో ఈ డెడ్‌లైన్‌ ప్రకటించినా ఆశించిన స్థాయిలో పనులు పూర్తి చేయలేకపోయారు.

సాంకేతిక సమస్యలతో పాటు పగటిపూట వేగంగా పనులు పూర్తి చేయడంలో అవరోధాలు ఎదురవడంతో జాప్యం జరిగినట్లు చెబుతున్నారు.
ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని మున్సిపల్ కమిషనర్ హరిత ప్రకటించారు. శ్రీనివాస సేతు నిర్మాణ పనుల్లో అపశ్రుతి బాధాకరమని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పారు.