ఈడీ చీఫ్ పదవి కాలం పొడిగింపుపై మళ్లీ సుప్రీంకు కేంద్రం

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ మిశ్రా పదవీకాలం పొడిగించాలని కోరుతూ బుధవారం కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈమేరకు తాజాగా పిటిషన్ వేసింది. పదవీకాలం పొడిగింపు విషయంలో ఇదివరకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తాజా పిటిషన్‌ను పరిశీలించాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టును కోరారు. 

గురువారం ఈ పిటిషన్‌ను లిస్ట్ చేసేందుకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది.  కనీసం వచ్చే అక్టోబర్‌ 15వ తేదీ వరకైనా ఆయనను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. మూడోసారి పదవీకాలం పొడిగింపు ప్రకారం మిశ్రా పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌ 18 వరకు ఉన్నది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధిపతిగా నవంబర్ 2018 లో సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. రెండేళ్ల తర్వాత (60 ఏళ్ల వయసు వచ్చిన ) ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ నవంబర్ 2020 లో ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అనంతరం 2022 లోనూ మూడోసారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే దీనిని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్‌తోపాటు పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, సంజయ్ మిశ్రా పొడిగింపు కుదరదని స్పష్టం చేసింది. జులై 31 తర్వాత ఆయన ఆ పదవిలో ఉండరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆలోపు ఈడీకి కొత్త అధిపతిని నియమించుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈ క్రమంలోనే కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫైనాన్షియల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) రివ్యూ ఉన్నందున మిశ్రాను ఈడీ డైరెక్టర్‌గా కొనసాగించటం తప్పనిసరి అని తెలిపారు. ఈ రివ్యూ కోసం అనేక నివేదికలు సిద్ధం చేయాల్సి ఉన్నదని, అందుకు మిశ్రా అనుభవం ఉపయోగపడుతుందని తెలిపారు. అందువల్ల తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు.