ఈ కేసులోని ప్రధాన నిందితులలో ఒకడి ఇంటిని గురువారం మహిళలు తగలబెట్టారు. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియోలో ఈ నిందితుడు ప్రధానంగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళల్లో ఒకరు కార్గిల్ యుద్ధంలో అస్సాం రెజిమెంట్ కు చెందిన సుబేదార్ పోస్టులో భారతీయ సైన్యం తరఫున పోరాడిన మాజీ సైనికుడి భార్య అన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇదిలా ఉండగా ఇద్దరు గిరిజన మహిళలపై జరిగిన అనాగరిక, అమానవీయ దాడి ఘటనను యునైటెడ్ నాగా కౌన్సిల్, ఆల్ నాగా స్టూడెంట్స్ అసోసియేషన్తోసహా అనేక నాగా పౌర సమాజ సంఘాలు ఖండించాయి. బాధిత మహిళలకు సత్వర న్యాయం అందచేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని యునైటెడ్ నాగా కౌన్సిల్ డిమాండ్ చేసిది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారే వదంతులతో ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, దీనిని అడ్డుకోవడానికి గట్టి నిఘా పెట్టామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ గందరగోళ పరిస్థితుల మధ్య స్థానిక పోలీసు స్టేషన్లలో వనరుల కొరత ఏర్పడింది. దీంతో హత్య, దాడి వంటి తీవ్రమైన నేరాల దర్యాప్తుకు ఆటంకం కలుగుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలను నిర్వహించడమే ప్రధానంగా మారింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, శాంతి భద్రతల సమస్యలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర పోలీసులకు సహాయం చేయడానికి కేంద్రం 135 విభాగాలను అక్కడికి పంపింది. అయితే, ఇప్పటికీ ఇంకా చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నప్పటికీ.. పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని అధికారులు వివరించారు. ‘మణిపూర్లోని 16 జిల్లాల్లో సగం ఇప్పటికీ సమస్యాత్మకంగానే ఉన్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి బలగాలను రొటేషన్ విధానంలో వాడుతున్నాం’ అని సంబంధిత అధికారులు తెలిపారు.

More Stories
లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్ ‘భైరవ్’!
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం
భారత్ లో జరిగే టి20 ప్రపంచకప్ కు బాంగ్లాదేశ్ దూరం!