ప్రపంచంలో కరోనా తరహా మరో మహమ్మారి

ప్రపంచం కరోనా తరహా మరో మహమ్మారిని ఎదుర్కోనుందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ బంగా హెచ్చరించారు. ఇది ఎప్పుడైనా సంభవించవచ్చునని, అయితే ఇది అనివార్య పరిణామమే అవుతుందని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని స్కిల్ ఇండియా మిషన్ సెంటర్‌ను ఆయన బుధవారం సందర్శించారు. 

“కరోనానుంచి గట్టెక్కాం, అయితే దీనితో మనం పలు విధాలుగా కష్టాలు, నష్టాలను చవిచూశాం. ఇదే దశలో వీటిని ఎదుర్కొనే పాఠాలు నేర్చుకున్నామన్నారు. ఓ తరానికి సరిపడా చేదు అనుభవాలు, ఇదే దశలో సవాళ్లను తట్టుకునే తత్వం అలవర్చుకున్నాము” అని తెలిపారు. 

ప్రత్యేకించి విద్యార్థులకు విలువైన చదువుకునే దశలో చిక్కులు ఏర్పడ్డాయని చెబుతూ విద్యార్థుల జీవితకాలపు సంపాదనలో ఈ విధంగా ఎదురైన నష్టం 17 ట్రిలియన్ల డాలర్ల వరకూ ఉంటుందని 2021 ప్రపంచబ్యాంక్ నివేదికలో తేల్చిన విషయాన్ని బంగా గుర్తు చేశారు. జరిగిన నష్టాన్ని మనం జరగబోయే మరో మహమ్మారి నష్టం ఎదుర్కొనేందుకు సమాయత్తం కావడంతో భర్తీ చేసుకోవల్సి ఉంటుందని ఆయన సూచించారు.

భారతీయ సంతతికి చెందిన అజయ్ బంగా గడిచిన నెలలోనే ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.  భారతదేశంలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన వాతావరణ, పర్యావరణ అంశాల గురించి కూడా ప్రస్తావించారు. పునరుత్థాన ఇంధన పర్యావరణ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా నెలకొనేందుకు ఏడాదికి ట్రిలియన్ డాలర్లు అవసరం చెప్పారు. 

ఈ సొమ్ము కేవలం ప్రభుత్వాల నుంచి అందుతుందని తాను భావించడం లేదని, ధాతృత వ్యక్తులు, బహుళస్థాయి బ్యాంకుల నుంచి, ప్రైవేటు రంగం నుంచి కూడా అందాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్‌లో జరిగిన జి 20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు వచ్చారు. పలు సదస్సుల దశల్లో ఆర్థిక అంశాలపై సమగ్రంగా విశ్లేషించారు.