ఐదు నెలల్లో మమతా ప్రభుత్వం కూలిపోతుందా!

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌  కాంగ్రెస్‌ (టీఎంసీ) ప్రభుత్వం ఐదు నెలల్లో కూలిపోతుందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీఎంసీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉందని ఈ సందర్భంగా పేర్కొనడంతో అధికార పక్షంలో ఆందోళన చెలరేగుతుంది. 
 
ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఇద్దరు సీనియర్ బిజెపి నాయకులు ఆదివారం ఈ విషయమై చేసిన ప్రకటనలు ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి.  బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి శంతను ఠాకూర్, తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బొంగావ్‌లో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ టీఎంసీ ప్రభుత్వం ఐదు నెలలకు మించి అధికారంలో ఉండదని స్పష్టం చేశారు. 
 
టీఎంసీ రిగ్గింగ్‌కు పాల్పడకపోతే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలతో బీజేపీ గెలిచి ఉండేదని ఆయన తెలిపారు.  ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పక్షపాతంగా వ్యవహరించినట్లు ఆయన ఆరోపించారు. అయితే టీఎంసీ ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలని ఆయన తేల్చి చెప్పారు.  
 
బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు  సుకాంత మజుందార్ కూడా శంతను ఠాకూర్ వ్యాఖ్యలను సమర్థించారు.  ఏ సమయంలోనైనా ఏదైనా జరుగవచ్చని ఆయన తెలిపారు. ఒక ప్రభుత్వం మెజారిటీ ఎమ్యెల్యేల మద్దతో కోల్పోతే కూలిపోతుందని చెబుతూ టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి ఎదురు తిరుగవచ్చన్నది ఎవరికి తెలుసని ఆయన నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశం ఉందని అంటూ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. 
 
అయితే, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేయలేనప్పటికీ, రాజ్యాంగం సూచించిన విధంగా విధిని నిర్వర్తించడంలో ప్రభుత్వం విఫలమైతే రక్షించడానికి కేంద్రం జోక్యం చేసుకుంటుందని బీజేపీ నేత, బెంగాల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి హెచ్చరించారు. రాష్ట్రంలో ఆర్టికల్‌ 355ను కేంద్రం అమలు చేయాలని ఇటీవల ఆయన డిమాండ్‌ చేశారు.మరోవైపు బీజేపీ నేతల వ్యాఖ్యలను టీఎంసీ నేతలు కొట్టిపారవేస్తున్నారు. టీఎంసీ రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి శాంతను సేన్ దీని గురించి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి వల్ల నిరాశతో ఉన్న బీజేపీ నేతలు ఢిల్లీలో తమ రేటింగ్‌ను పెంచుకునేందుకు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు.

టీఎంసీ ప్రభుత్వం పడిపోతుందంటూ గతంలో కూడా బీజేపీ నేతలు చాలా సార్లు అంచనాలు వేశారని, నిర్దిష్ట తేదీలు కూడా ప్రకటించినప్పటికీ ఏమీ జరుగలేదని శాంతను సేన్‌ పేర్కొన్నారు. టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ కూడా పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత నిరుత్సాహానికి గురైన శ్రేణుల మనోధైర్యాన్ని పెంచడానికి బీజేపీ నేతలు ఇలాంటి పసలేని వాదనలు చేస్తున్నారని విమర్శించారు.